- కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీకి గవర్నర్ తమిళిసై ఆదేశం
- ఖమ్మం, రామాయంపేటలో జరిగిన ఆత్మహత్యలపైనా ఆరా
- వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచన
హైదరాబాద్, వెలుగు: మెడికల్ పీజీ సీట్ల బ్లాకింగ్ దందాపై గవర్నర్ తమిళిసై స్పందించారు. పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీని గురువారం ఆదేశించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మెరిట్ ర్యాంకర్లను తీసుకొచ్చి సీట్లు బ్లాక్ చేయించడం వల్ల రాష్ట్రానికి చెందిన స్టూడెంట్లకు అన్యాయం జరుగుతోందని వార్తలు రావడంతో ఈ విషయాన్ని గవర్నర్ సీరియస్గా తీసుకున్నారు. మన స్టూడెంట్లకు న్యాయం చేసేందుకు తీసుకున్న చర్యలు తెలుపాలని వీసీని ఆదేశించారు. సీటు బ్లాకింగ్ దందాపై వరుసగా వార్తలు రావడంతో ఇటీవలే కాళోజీ హెల్త్ వర్సిటీ కూడా స్పందించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 45 సీట్లను బ్లాక్ చేశారని పోలీసులకు వర్సిటీ ఫిర్యాదు చేసింది.
వరుస క్రైమ్లపైనా..
రాష్ట్రంలో వరుస ఆత్మహత్యలు, హత్యలు, రేప్లపై కూడా గవర్నర్ స్పందించారు.
..రిపోర్ట్ ఇవ్వండి
వీటిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మంలో జరిగిన సాయిగణేశ్ ఆత్మహత్య, కామారెడ్డిలో తల్లీకొడుకు ఆత్మహత్య, భువనగిరిలో జరిగిన పరువు హత్య, కోదాడలో జరిగిన గ్యాంగ్ రేప్ వంటి ఘటనలు ఇటీవల రాష్ట్రంలో సంచలనం రేకెత్తించాయి. పరువు హత్య మినహా మిగతా వాటిలో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని, పోలీసులు మెతకవైఖరి ప్రదర్శిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశంపై బీజేపీ నాయకులు గవర్నర్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ అన్ని ఘటనలపై డిటైల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు.