రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురి మృతదేహాలకు రీపోస్ట్మార్టం నిర్వహించి రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వరంగల్ ఎంసీఎం ఫోరెన్సిక్ నిపుణులు తిరిగి పోస్టుమా ర్టం చేశాక డెడ్ బాడీలను బంధువులకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. చర్ల మండలం చెన్నాపురం ఫారెస్ట్ ఏరియాలో ముగ్గురిని ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని ప్రొఫెసర్ లక్ష్మణ్ ఫైల్ చేసిన లంచ్ మోషన్ పిల్ ను చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. పిటిషనర్ తరఫు లాయర్ వి.రఘునాథ్ వాదిస్తూ.. రాష్ట్రంలో పౌరహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, గత 20 రోజుల్లో ఏకంగా 8 మందిని ఎన్కౌంటర్ పేరుతో మట్టుబెట్టారని చెప్పారు. చర్ల ఘటనపై పలు సందేహాలు ఉన్నాయన్నారు. బుధవారం రాత్రి 7.30 గంటలకు ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు చెబుతున్నారని, అయితే ఉదయమే జరిగినట్లు అనుమానం ఉందన్నారు. హడావుడిగా పోస్ట్మార్టం చేసి డెడ్ బాడీలను బంధువులకు అప్పగించడంతో ఎన్కౌంటర్ పై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయని చె ప్పారు. దీన్ని ఏజీ బీఎస్ ప్రసాద్ వ్యతిరేకించారు. మావోయిస్టులు కాల్పులకు పాల్పడటం వల్లే పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని చెప్పారు. రూల్స్ ప్రకారం వీడియో చిత్రీకరణలోనే పోస్టుమార్టం జరిగిందన్నారు. రీపోస్ట్మార్టం చేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో అంత్యక్రియలు నిర్వహించకుండా ఉంటే రీపోస్ట్ మార్టం చేసి రిపోర్టు ఇస్తామని చెప్పారు. రీపోస్ట్ మార్టం చేయాలని ఆదేశించిన బెంచ్.. తర్వాతి విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది.
For More News..