టన్నెల్ లోనే 40 మంది .. ఐదు రోజులైనా వీడని ఉత్కంఠ

టన్నెల్ లోనే 40 మంది .. ఐదు రోజులైనా వీడని ఉత్కంఠ
  • ఉత్తరాఖండ్​లోని టన్నెల్​ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ
  • 3 ఫీట్ల పైప్​ను లోపలికి పంపించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు
  • లోపల కార్మికులు సేఫ్​గా ఉన్నారన్న కేంద్ర మంత్రి వీకే సింగ్

ఉత్తరకాశి :  ఉత్తరాఖండ్​లోని టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ ఐదోరోజు కొనసాగుతోంది. అమెరికన్ అగర్ మెషీన్ తో డ్రిల్లింగ్ జరుగుతోంది. గురువారం కేంద్ర రోడ్డు రవాణా సహాయ మంత్రి వీకే సింగ్ స్పాట్​ను పరిశీలించారు. టన్నెల్ లో చిక్కుకున్న 40 మంది కార్మికులను సేఫ్ గా బయటికి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని మీడియాతో చెప్పారు. అయితే, డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు మట్టిపెల్లలు, బండరాళ్లు పడటంతో ఆటంకం ఎదురైందన్నారు. ఇప్పుడు మెషీన్​ను పకడ్బందీగా అమర్చామని, రెండు మూడు రోజుల్లో ఆపరేషన్ ముగిసే అవకాశం ఉందన్నారు. కార్మికులంతా ఇప్పటివరకు సేఫ్​గా ఉన్నారని, వాళ్లకు ఆక్సిజన్, ఫుడ్ సప్లయ్ చేస్తున్నామని చెప్పారు. 

‘‘కార్మికులతో నేను మాట్లాడాను. వాళ్లలో మనోధైర్యం మెండుగా ఉంది”అని వీకే సింగ్ అన్నారు. కాగా, దాదాపు 3 ఫీట్ల స్టీల్​పైప్​ను శిథిలాల గుండా టన్నెల్​లోకి చొప్పించి, ఆ పైప్​లోంచి కార్మికులను బయటికి తీసుకువచ్చేలా అధికారులు ప్లాన్ చేశారు. అందుకు అగర్ మెషీన్​తో డ్రిల్లింగ్ కొనసాగిస్తున్నారు. గంటకు 5 మీటర్ల చొప్పున ఆ మెషీన్ డ్రిల్ చేస్తోందని, ఆటంకాలు ఎదురుకాకపోతే 12 నుంచి 15 గంట్లలో కార్మికులను సేఫ్​గా బయటికి తీసుకువస్తామని అధికారులు చెప్తున్నారు. చార్​ధామ్ ప్రాజెక్టులో భాగంగా ఉత్తరకాశీలో నిర్మిస్తున్న సొరంగంలో ముందుభాగం ఈ నెల 12న ఆదివారం కూలిపోయింది. దీంతో 40 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. 

ALSO READ: చైనా అధ్యక్షుడు జిన్‌‌‌‌పింగ్ నియంతే: బైడెన్‌‌‌‌

నేను సేఫ్ గానే ఉన్నా: కార్మికుడి ఆడియో 

ఆక్సిజన్ చేరేలా ఏర్పాటు చేసిన పైప్ ద్వారా టన్నెల్ లో చిక్కుకున్న మహదేవ్ అనే కార్మికుడి వాయిస్ క్లిప్ గురువారం బయటకొచ్చింది. మహదేవ్ అధికారితో మాట్లాడుతూ.. తాను సేఫ్​గానే ఉన్నానని, ఆందోళన చెందవద్దని తన కుటుంబ సభ్యులకు చెప్పాలని కోరాడు.