హైదరాబాద్ నాంపల్లిలోని బచస్ ఫర్నిచర్స్ షాపులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. 22 గంటలకు పైగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ లో ఇవాళ ఐదుగురి మృతదేహాలను వెలికి తీసింది రెస్క్యూ టీం.
నాలుగు అంతస్తుల భవనంలో రెండు సెల్లార్ల కింద చిక్కుకుని ఐదుగురి చనిపోయారు. సెల్లార్లో చిక్కుకున్న వాచ్ మెన్ బేబీ(43), అఖిల్(12, ప్రణీత్(9) వారిని కాపాడటానికి వెళ్లిన ఇంతియాజ్(27), డ్రైవర్ హబీబ్ మంటల్లో(40) కాలిపోయారు.మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. పోస్టు మార్టం కోసం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు అధికారులు.
జనవరి 24 మధ్యాహ్నం హైదరాబాద్ లోని అబిడ్స్ నుంచి నాంపల్లి రైల్వేస్టేషన్ వెళ్లే రోడ్డులో బచస్ ఫర్నిచర్ క్యాస్టిల్ షాపులో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ సహా మంటల్లో చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు వెళ్లిన ఇంతియాజ్, హబీబ్ కూడా సెల్లార్లో చిక్కుకుపోయారు. ప్లాస్టిక్తో నిండిన పొగతో ఊపిరి ఆడక అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, డెడ్బాడీలు గుర్తించలేనంతగా కాలిబూడిదయ్యాయి. ఘటనా స్థలంలో దాదాపు 200 మంది ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 22 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ చేశారు. కానీ మంటల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడలేక పోయారు. రెండు సెల్లార్లలోనూ భారీగా ఫర్నీచర్ ఉండటంతో మంటలు త్వరగా అదుపులోకి రాలేదు. దీంతో సెల్లార్ కింద గుంత తవ్వి వారి మృతదేహాలను వెలికి తీసింది రెస్క్యూ టీం.
