
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో 2008 నాటి మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను అరెస్ట్ చేయాలని అప్పట్లో తనకు ఆదేశాలు వచ్చాయని మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) రిటైర్డ్ అధికారి మెహబూబ్ ముజావర్ అన్నారు. శుక్రవారం ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ కేసుకు సంబంధించి రామ్ కల్సంగ్రా, సందీప్ దంగే, దిలీప్ పాటిదార్తో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను కూడా అరెస్ట్ చేయాలని చెప్పారు. మహారాష్ట్రలో అంతటి ప్రభావం చూపే వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే నా శక్తికి మించిన పని.
భగవత్ను అరెస్ట్ చేయాలని మాలెగావ్ పేలుళ్ల కేసు దర్యాప్తు అధికారి పరమ్ బీర్ సింగ్తో పాటు మరికొంత మంది ఉన్నతాధికారుల నుంచి నాకు ఆదేశాలు వచ్చాయి. వారిని అరెస్ట్ చేసి దేశంలో కాషాయ ఉగ్రవాదాన్ని తెరపైకి తెచ్చేందుకు పరమ్ బీర్ సింగ్ ప్రయత్నించారు. అలాగే, చనిపోయిన వారిని సజీవంగా ఉన్నారంటూ ఛార్జ్షీట్ దాఖలు చేయాలని చెప్పారు. వీటన్నింటికి నేను ఒప్పుకోలేదు. అందుకే నాపై తప్పుడు కేసును పెట్టారు. కొన్నిరోజుల తర్వాత ఆ కేసుల నుంచి నేను నిర్దోషిగా బయటపడ్డాను” అని ఆయన వెల్లడించారు.