- ప్రముఖ అంబేద్కర్ వాది జేబీ రాజు
ముషీరాబాద్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని చిత్తుగా ఓడించి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, సామాజిక శక్తుల కర్తవ్యమని ప్రముఖ అంబేద్కర్ వాది రిటైర్డ్ ఆఫీసర్ జేపీ రాజు పిలుపునిచ్చారు. బుధవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో ‘ సార్వత్రిక ఎన్నికలు – సామాజిక కర్తవ్యం’ అంశంపై రౌండ్ టేబుల్ మీటింగ్ ఎం. దశరథ్ అధ్యక్షతన జరిగింది. ఇందులో పాల్గొన్న రాజు మాట్లాడుతూ పదేండ్ల బీజేపీ పాలనలో
దళితులపై 300 రేట్లు దాడులు పెరిగాయని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, మహిళలకు ఏ మాత్రం రక్షణ లేదని ఆరోపించారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. బీజేపీకి ఓటు వేయాలంటున్న మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదిగల ఓట్లను బీజేపీకి ఒక పావుగా మారాడని విమర్శించారు. ఈ సమావేశంలో జి. రాములు, ఆరేపల్లి రాజేందర్, పల్లెల వీరస్వామి, మారుపాక అనిల్ కుమార్, పోకల కిరణ్ కుమార్, శ్రీరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.