
- పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నం
- అమర రాజా, అదానీ గ్రూప్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి
- కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం.. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం ఉంటుందన్న సీఎం
- రూ.9,500 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చిన అమర రాజా
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెట్టుబడులతో వస్తే అన్ని రకాల సౌలత్లు, సహకారంతో పాటు రాయితీలు అందిస్తామని తెలిపారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్లపై బుధవారం అమర రాజా కంపెనీ చైర్మన్, ఎండీ గల్లా జయదేవ్, అదానీ గ్రూప్ ప్రతినిధులు సీఎం రేవంత్రెడ్డితో సెక్రటేరియెట్లో వేర్వేరుగా భేటీ అయ్యారు. ప్రభుత్వం అందించే సహకారంతో పాటు పెట్టుబడులపై చర్చించారు. ఈ సందర్భంగా అమర రాజా కంపెనీ ఎండీ గల్లా జయదేవ్తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఉపాధి కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో అమర రాజ కీలక భాగస్వామి అని తెలిపారు. రాష్ట్రంలో కంపెనీ చేపట్టిన కొత్త ప్రాజెక్ట్లకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సాయం అందుతుందని భరోసా ఇచ్చారు. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ గిగా ఫ్యాక్టరీ, ప్యాక్ అసెంబ్లీ, ఈ – పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్ల నిర్వహణకు హెల్ప్ చేస్తామన్నారు. క్లీన్ ఎనర్జీకి తెలంగాణ కట్టుబడి ఉందని చెప్పారు. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ వంటి అధునాతన స్టోరేజీ టెక్నాలజీలకు, కొత్త పరిశ్రమల స్థాపనకు తమ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
సహకరిస్తే ప్రాజెక్ట్ను మరింత విస్తరింపజేస్తాం: గల్లా జయదేవ్
అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ (గతంలో అమర రాజా బ్యాటరీస్) మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి గ్రామంలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నది. ప్రాజెక్ట్ పనుల పురోగతిపై గల్లా జయదేవ్తో సీఎం రేవంత్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై సీఎంకు గల్లా థ్యాంక్స్ చెప్పారు. ప్రభుత్వ సహకరిస్తే.. తమ ప్రాజెక్ట్ ను మరింత విస్తరింపజేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎలక్ట్రికల్ వెహికల్స్, న్యూ ఎనర్జీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తున్నదని కొనియాడారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సర్కార్ నుంచి తగినంత మద్దతు ఆశిస్తున్నామని తెలిపారు. మరికొన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని చెప్పారు.
పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం: అదానీ గ్రూప్
తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. ఏరో స్పేస్ పార్క్తో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని తెలిపింది. బుధవారం సెక్రటేరియెట్లో సీఎం రేవంత్ రెడ్డితో పోర్ట్స్ సెజ్ సీఈవో, గౌతమ్ అదానీ పెద్ద కొడుకు కరణ్ అదానీ, అదానీ ఏరో స్పేస్ సీఈవో ఆశీష్ రాజ్ వన్షి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. కంపెనీలు పెట్టేందుకు ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో అదానీ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్లను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అదానీ గ్రూప్ ప్రతినిధులు మాట్లాడారు. ఇప్పటికే కొనసాగుతున్న పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని తెలిపారు. కొత్త ప్రాజెక్ట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని చెప్పారు. తెలంగాణలో ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ ముందు నిలబడుతుందన్నారు. ప్రభుత్వం మారినా.. తాము పెట్టుబడులకు ఇంకా సిద్ధంగానే ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతితో పాటు కొత్త కంపెనీల ఏర్పాటుపై చర్చించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసిమ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రూ.9,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్
అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ (ఏఆర్ఈ అండ్ ఎం) దేశంలోని ప్రముఖ ఎనర్జీ స్టోరేజ్, మొబిలిటీ ఎంటర్ప్రైజ్లో ఒకటి. పారిశ్రామిక, ఆటో మోటివ్స్ రంగంలో ఉపయోగించే బ్యాటరీల తయారీదారుల్లో అతిపెద్ద కంపెనీ. ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్కు అనుగుణంగా అడ్వాన్స్డ్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా గిగా కారిడార్ ఏర్పాటు చేస్తున్నది. దేశంలో అతిపెద్ద అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఎసీసీ), లిథియం -అయాన్ బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీని ఇక్కడ నెలకొల్పుతున్నారు. తెలంగాణ న్యూ ఎనర్జీ పార్క్, బ్యాటరీ ప్యాక్, అసెంబ్లింగ్ యూనిట్, శంషాబాద్లోని ఈ – పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్ పేరుతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం రూ.9,500 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీ ముందుకొచ్చింది. 9వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.