కేసీఆర్, కేటీఆర్‌లను తప్ప ఎవర్నీ స్మరించొద్దా?

కేసీఆర్, కేటీఆర్‌లను తప్ప ఎవర్నీ స్మరించొద్దా?

కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన  విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌సైరన్‌  ర్యాలీకి వెళ్లకుండా జూబ్లీహిల్స్ లోని  రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గర  పోలీసులు భారీగా మోహరించారు. దిల్‌సుఖ్ నగర్‌ వెళ్లేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రేవంత్‌ను గేటు దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ శ్రేణులు నినాదాలు చేశారు. గాంధీ జయంతి రోజున నా ఇంటి దగ్గర  ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను రేవంత్‌ ప్రశ్నించారు. హౌస్ అరెస్ట్ లు చేస్తే ఆర్డర్‌ కాపీ చూపించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకోసం అమరుడైన శ్రీకాంత్‌ ఆచారికి గాంధీజీ జయంతి రోజున నివాళులు అర్పించే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. శ్రీకాంత చారి ఏమైనా కసబ్ ఆ.. మేము టెర్రలిస్టులమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత చారి విగ్రహానికి నివాళులు అర్పిస్తే కేసీఆర్,కేటీఆర్ లకు వస్తున్న నొప్పి ఏంది అని ప్రశ్నించారు. తెలంగాణలో 1200 మంది అమరవీరుల త్యాగలతో  ఏర్పడ్డ తెలంగాణలో కనీసం అమరులకు నివాళులు అర్పించే హక్కు లేదా అని అన్నారు. తెలంగాణలో కేసీఆర్,కేటీఆర్ లను తప్ప ఎవర్ని స్మరించవద్దా..ఇంత దుర్మార్గ పాలన ఉంటుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్‌ జంగ్‌ సైరన్‌ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి ఇంటి దగ్గరే రేవంత్‌రెడ్డి బైఠాయించారు.