
ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫ్యామిలీకి రెండు టికెట్లు ఇస్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మైనంపల్లి సెప్టెంబర్ 28న సాయంత్రం కాంగ్రెస్ లో చేరుతారని చెప్పారు. ఇటీవల మైనంపల్లి బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే..
కేటీఆర్ కి చట్టం పట్ల అవగాహన లేదన్నారు రేవంత్ రెడ్డి. ఆయనకు బుర్ర తక్కువ ఆకలి ఎక్కువని విమర్శించారు. గవర్నర్ కోటలో ఎవరిని నామినేట్ చేయాలనే మినిమం కామన్ సెన్స్ ప్రభుత్వానికి లేదన్నారు. తమ పార్టీ టికెట్ల ఎంపికలో గెలుపును ప్రాధాన్యత అంశంగా తీసుకుంటున్నామని చెప్పారు.
చంద్రబాబు అరెస్ట్ ఏపీకి పరిమితమైన అంశం కాదని.. ఆయన జాతీయ స్థాయి వ్యక్తన్నారు రేవంత్. చంద్రబాబంత అనుభవం ఉన్నవాళ్లని.. వేళ్లపై లెక్కపెట్టొచ్చన్నారు. ఎన్నికల్లో సెటిలర్స్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడుతారన్నారు. పన్నులు కట్టించుకొని, ఓట్లు వేయించుకొని తమ రాష్ట్రం సమస్య కాదని అంటే ప్రజలు ఊరుకోరన్నారు.