కేసీఆర్ మారడు..ఆయన్ని మార్చాల్సిందే : రేవంత్ రెడ్డి

కేసీఆర్ మారడు..ఆయన్ని మార్చాల్సిందే : రేవంత్ రెడ్డి

కేసీఆర్,  మోదీలది కార్పొరేట్ ఫ్రెండ్లీ విధానం : రేవంత్ రెడ్డి 

భూపాలపల్లి జిల్లా : తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ శాఖ కార్మికుల పాత్ర ఎంతో కీలకమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సకల జనుల సమ్మెకు సైరన్ ఊది కార్మికులు నడుం బిగించిన తర్వాతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. బొగ్గుగని కార్మిక సంఘానికి ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ కార్మిక సంఘానికి మంత్రి హరీష్ రావు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారని, కార్మిక సంఘాలను కూడా కేసీఆర్ కుటుంబమే గుతాధిపత్యం చేసి అధికారంలో కొనసాగుతున్నారని ఆరోపించారు. సీఎం కూతురే గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నా బొగ్గు గని కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. వేలాది కోట్లు కొల్లగొట్టడానికే తప్ప.. కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కేసీఆర్ కుటుంబం ప్రయత్నించడం లేదని ఆరోపించారు. తొమ్మిదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అవిభక్త కవలల్లా కలిసే ఉన్నారని, ఇప్పుడు వేరుగా ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని  వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలన్నింటికీ సీఎం కేసీఆర్ సహకరించారని చెప్పారు. ప్రజా వ్యతిరేకత చూసి భయంతో వేరుగా ఉన్నామని చూపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 

తాడిచర్ల మైన్ ను కేసీఆర్ ఎవరికి అప్పగించారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాడిచర్ల మైన్ లో కేసీఆర్ కుటుంబం వాటా ఎంతన్నారు. ఒరిస్సాలో ఉన్న కోల్ మైన్ ను ఆదానికి అమ్మేస్తే... దానిపై కాంగ్రెస్ ఎంపీలు ఉన్న తాము కొట్లాడామని, అందుకే నైని కోల్ మైన్ అమ్మకం ఆగిపోయిందని చెప్పారు. ప్రతిమా శ్రీనివాస్ కు లాభం చేకూర్చేందుకు కేసీఆర్ ఈ ఒప్పందానికి సహకరించింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. కేసీఆర్,  మోడీలది కార్పొరేట్ ఫ్రెండ్లీ విధానం అన్నారు. శ్రీధర్ ను సీఎండీగా కొనసాగించడం వెనక కేసీఆర్ కు ఉన్న ఉపయోగం ఏంటో ఆలోచించాలని కోరారు. లాభాల్లో ఉన్న సింగరేణిని దివాళా తీయించేందుకు సీఎండీ శ్రీధర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటిపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణకు అదేశిస్తామని స్పష్టం చేశారు. సింగరేణిని లాభాల బాటలో పయనించేలా కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయన్నారు. ‘కేసీఆర్ మారడు.. ఇక ఆయన్ని మార్చాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ తెచ్చిన అని చెప్పిన కేసీఆర్ కు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఉంది. తెలంగాణ సాధించడమే కాదు.. దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా కార్మికులపై ఉంది’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.