
- దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను పెంచండి
- సరిపడా రైల్వే రేక్లను కేటాయించండి
- కేంద్ర ఎరువుల శాఖ మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ వినతి
- రెండో రోజు కేంద్ర మంత్రులు నడ్డా, పీయూష్ గోయల్తో భేటీ
- జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించండి
- ఎన్ఐసీడీఐటీ ఆమోదించిన రూ.596.61 కోట్లు విడుదల చేయండి
- వరంగల్ ఎయిర్పోర్ట్కు నిధులు ఇవ్వండి
- హైదరాబాద్–బెంగళూరు ఏరో-డిఫెన్స్ కారిడార్ను మంజూరు చేయాలని రిక్వెస్ట్
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియా ను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులకు నీళ్లు రావడం.. సాగు పనులు జోరుగా సాగుతున్నందున యూరియా సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలని కోరారు. రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఆయన అధికారిక నివాసంలో సీఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు వెంట ఉన్నారు.
వానాకాలం సీజన్కు సంబంధించి ఏప్రిల్-–జూన్ మధ్య 5 లక్షల టన్నులకుగానూ కేవలం 3.07 లక్షల టన్నుల ఎరువులు మాత్రమే సరఫరా చేశారని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లారు. జులై నెలకు సంబంధించి 63 వేల టన్నులు దేశీయంగా ఉత్పత్తి అయిన, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 97 వేల టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకూ కేవలం 29 వేల టన్నులు మాత్రమే చేశారని తెలిపారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను తెలంగాణకు పెంచాలని సీఎం రేవంత్ కోరారు. యూరియా సరఫరాకు సంబంధించి రైల్వే శాఖ తగిన రేక్లు కేటాయించడం లేదని, వాటి సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు.
జడ్ఐఎస్సీకి వసతులు కల్పించండి
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (జడ్ఐఎస్సీ) అభివృద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను సీఎంరేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని వాణిజ్య భవన్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జడ్ఐఎస్సీ కోసం జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమలు ట్రస్ట్ (ఎన్ఐసీడీఐటీ) ఆమోదించిన రూ.596.61 కోట్లను త్వరగా విడుదల చేయాలని కోరారు. స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలన్నారు. అలాగే, హైదరాబాద్–వరంగల్ పారిశ్రామిక కారిడార్ లో భాగంగా వరంగల్ ఎయిర్ పోర్ట్కు నిధులు మంజూరు చేయాలని రిక్వెస్ట్ చేశారు.
హైదరాబాద్–విజయవాడ పారిశ్రామిక కారిడార్ ఫీజిబిలిటీని అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం ఆదిభట్లలో అత్యున్నతమైన మౌలిక వసతులతో ప్రత్యేకమైన రక్షణ, ఏరోస్పేస్ పార్కును ఏర్పాటు చేసిందని, ఈ నేపథ్యంలో హైదరాబాద్–బెంగళూర్ పారిశ్రామిక కారిడార్ను ఏరో -డిఫెన్స్ కారిడార్గా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న వంద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తామని, కేంద్ర ప్రభుత్వం వాటికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కాగా.. రైల్వే ప్రాజెక్ట్లకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తోనూ సీఎం భేటీ కావాల్సి ఉండగా.. కేంద్రమంత్రి తండ్రి మరణంతో ఈ అపాయిట్మెంట్క్యాన్సిల్ అయినట్లు తెలిసింది.