
- ఫేక్ ట్రక్ షీట్లతో మిల్లర్ల స్కామ్.. పదేండ్ల నుంచి ఇదే కథ
- కౌలు రైతుల కోసం కేటాయించిన ఆప్షన్తో దందా
- కుటుంబసభ్యులు, తెలిసినోళ్ల పేర్లు చేర్చి రూ. 2వేల కోట్లకు పైగా దోపిడీ
- సహకరించిన కొందరు ఆఫీసర్లు, సెంటర్ల నిర్వాహకులు
- సీఎంఆర్ బియ్యం ఇవ్వకపోవడం వెనుక మతలబు ఇదే!
- విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో బయటపడుతున్న బాగోతం
నిరుడు డిసెంబర్లో సూర్యాపేట జిల్లాలోని నాలుగు మిల్లులపై దాడులు నిర్వహించగా.. రెండు మిల్లుల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. తిరుమలగిరిలోని సూర్యాపేట రైస్ మిల్లర్ల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మిడి సోమనర్సయ్యకు చెందిన సంతోషిమాత రైస్మిల్, రఘురామ రైస్ ఇండ్రస్ట్రీలో దాదాపు రూ. 220 కోట్ల సీఎంఆర్ రైస్ పక్కదారి పట్టినట్లు అధికారులు తేల్చారు.
వీటితో పాటు కోదాడ శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ లో రూ.90కోట్ల సీఎంఆర్ బియ్యం మాయమైనట్లు గుర్తించారు. మొదట్లో మరాడించిన వడ్లను అమ్ముకొని సీఎంఆర్ఎగవేశారని భావించగా, ప్రస్తుతం ఫేక్ ట్రక్ షీట్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో సూర్యాపేట జిల్లాలోనూ మరోసారి తనిఖీలు చేపట్టేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్అధికారులు రెడీ అవుతున్నారు.
నెట్వర్క్, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను అడ్డాగా చేసుకొని మిల్లర్లు నడిపిన భారీ స్కామ్ బయటపడింది. వడ్లు కొనకుండానే కొన్నట్లుగా రికార్డులు చూపించి వేల కోట్లు దోచేశారు. ఫేక్ ట్రక్ షీట్లతో జరిగిన ఈ దందా వెనుక సూత్రదారులు రైస్ మిల్లర్లు కాగా.. వీరికి కొందరు అగ్రికల్చరల్ ఆఫీసర్లు, సెంటర్ల నిర్వాహకులు, సివిల్ సప్లయ్స్ ఆఫీసర్లు సహకరించినట్లు తేలింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ దందా ఇప్పటికీ కొనసాగుతున్నది. వడ్లు కేటాయించినట్లు రికార్డుల్లో ఉండడం, కానీ ఆ మేరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రాకపోవడంతో ఇటీవల సివిల్ సప్లయ్స్ కొత్త కమిషనర్ స్టీఫెన్రవీంద్ర.. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు ఆదేశించారు.
జిల్లాల్లో తనిఖీలు ప్రారంభించగానే ఈ స్కామ్ బయటపడింది. గత పదేండ్లుగా మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడం వెనుక అసలు మతలబు ఇదే అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎంక్వైరీ ఆఫీసర్లు తీగలాగినకొద్దీ ఒక్కో డొంక కదులుతున్నది. ఇలా ఫేక్ ట్రక్ షీట్లతో పక్కదారి పట్టిన నిధులు రూ. 2 వేల కోట్లకు పైగా ఉన్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.
పదేండ్లలో ఇబ్బడిముబ్బడిగా రైస్ మిల్లులు
రైతులు పండించిన వడ్లను మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో వానాకాలం, యాసంగి సీజన్లలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామగ్రామానా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. రైతుల సౌలభ్యం కోసం సెంటర్ల సంఖ్యను పెంచుతూ వస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 8 వేలకుపైగా కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నది.
వడ్ల సేకరణ కోసం ప్రభుత్వం ఒక్కో సీజన్లో తక్కువలో తక్కువ రూ. 20 వేల కోట్లకుపైగా నిధులను ఖర్చు చేస్తున్నది. కాగా, ఉమ్మడి ఏపీలో నష్టాలబాట పట్టిన రైస్ మిల్లులు ఒకదశలో మూసివేసే స్థితికి చేరుకున్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్అధికారంలోకి వచ్చాక ఒక్కసారిగా సీన్ మారింది. సర్కారే వడ్లను కొని ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా కోట్ల విలువైన వడ్లను రైస్ మిల్లర్లకు కేటాయించడం మొదలైంది.
ఇది కాస్తా లాభసాటి వ్యాపారంగా మారడంతో ఆ పార్టీకి చెందిన బడా నేతలు పెద్ద సంఖ్యలో రైస్ మిల్లులను ఏర్పాటు చేసి, కొన్నిచోట్ల అప్పటికే నడుస్తున్న మిల్లులను కూడా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఒకప్పుడు వెయ్యిలోపు ఉన్న రైస్ మిల్లులు బీఆర్ఎస్హయాంలో ఏకంగా 3,500కు చేరాయి. నిజానికి రైతుల నుంచి కొన్న వడ్లను కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) స్కీం కింద ప్రభుత్వం రైస్ మిల్లర్లకు కేటాయిస్తుంది.
మిల్లర్లు ప్రతి క్వింటాల్కు 67 కేజీల బియ్యం ప్రభుత్వానికి సప్లయ్ చేయాలి. వడ్లను బియ్యంగా మార్చడానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే మిల్లర్లకు చెల్లిస్తుంది. కాగా, సీఎంఆర్ స్కీమ్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని మిల్లర్లు వడ్లు కొనకుండా, బియ్యంగా మార్చి ప్రభుత్వానికి ఇవ్వకుండా ప్రభుత్వం నుంచి వేల కోట్లు దోచుకున్నారు.
ట్రక్ షీట్లపైనే పేర్లు.. అసలా రైతులే లేరు..
గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీ వంటి సంస్థలకు అప్పగిస్తుంటుంది. నిబంధనల ప్రకారం సెంటర్లో కొన్న వడ్ల బస్తాలను సివిల్ సప్లయ్ ఆఫీసర్లు కేటాయించిన రైస్ మిల్లులకు పంపించాలి. రైతుల పేర్లు, బస్తాల సంఖ్య లాంటి వివరాలతో నిర్వాహకులు ట్రక్షీట్తయారుచేసి లోడ్ను తీసుకెళ్లే లారీలతో పాటు మిల్లర్కు పంపించాలి.
రైస్ మిల్లర్ బస్తాలను అన్లోడ్ చేసుకున్నాక ఆ ట్రక్షీట్ మీద సంతకం చేసి, తన రైస్మిల్లు స్టాంప్ వేసి తిరిగి కొనుగోలు సెంటర్కు పంపించాలి. ఆ తర్వాత వడ్లు అమ్మిన రైతుల నుంచి తీసుకున్న ఆధార్, పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్, సెల్ ఫోన్ నెంబర్, అగ్రికల్చరల్ ఆఫీసర్లు ఇచ్చే టోకెన్ ఆధారంగా కోనుగోలు సెంటర్ నిర్వాహకులు చెల్లింపుల కోసం తమ దగ్గర ఉన్న ట్యాబ్లో వివరాలు నమోదు చేయాలి.
ఇవి సివిల్ సప్లయ్స్ డీఎం ఆఫీస్కు వెళ్లిన తర్వాత ఫైనల్ వెరిఫికేషన్ చేసి.. రెండు, మూడు రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలి. కానీ ఈ విధానంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొన్న కొందరు మిల్లర్లు స్కామ్కు తెరలేపారు.
కొనుగోలు సెంటర్ నిర్వాహకులకు, అగ్రికల్చరల్ ఆఫీసర్లకు, జిల్లాలో పనిచేసే కొందరు సివిల్ సప్లయ్ ఉద్యోగులకు డబ్బులు ఎరవేసి ట్రక్ షీట్లపై తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లు రాసి కొనుగోలు సెంటర్ల నుంచి వడ్ల బస్తాల లోడ్లను తమ రైస్ మిల్లులకు పంపించినట్లు, ఆ వడ్లను తమ రైస్ మిల్లులో అన్లోడ్ చేసుకున్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు.
అంటే ఆయా రైస్మిల్లులకు కొనుగోలు కేంద్రాల నుంచి ఎలాంటి వడ్లు తీసుకోనప్పటికీ ప్రభుత్వం ఇచ్చే కోట్ల సొమ్మును రైతుల పేరుతో కొట్టేశారు. ట్యాబ్లో కౌలు రైతుల కోసం ప్రభుత్వం కేటాయించిన ఆప్షన్ను ఇందుకు ఉపయోగించుకున్నారు. కొనుగోలు సెంటర్ పరిధిలో ఉన్న రైతుల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పంట పండించి తమకు వడ్లు అమ్మినట్లుగా తప్పుడు వివరాలను అప్లోడ్ చేసి రూ. కోట్ల నిధులు కాజేశారు.
ఒకటి కాదు, రెండు కాదు దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ దందా నడిపారు. ఇందుకు సహకరించిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, సివిల్ సప్లయ్ ఆఫీసర్లకు భారీగానే ముడుపులు ముట్టజెప్పినట్లు ఎంక్వైరీ ఆఫీసర్లు గుర్తించారు.
360 మంది మిల్లర్లు..రూ.3 వేల కోట్లకుపైగా దోపిడీ..
పదేండ్లుగా 360 మందికి పైగా రైస్ మిల్లర్లు రూ.3 వేల కోట్లకు పైగా విలువైన సీఎంఆర్ బియ్యం ఇవ్వకుండా ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. కేవలం 20 మంది మిల్లర్లే ఏకంగా రూ.600 కోట్ల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి సప్లయ్ చేయట్లేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో సివిల్ సప్లయ్ ఆఫీసర్లు రైస్ మిల్లులకు వెళ్లి తనిఖీలు చేస్తే అక్కడ వడ్ల బస్తాలు కనిపించడం లేదు.
బియ్యమూ లేవు. మొదట్లో ప్రభుత్వం కేటాయించిన వడ్లను మిల్లర్లు బయట అమ్ముకొని లెవీ పెట్టడం లేదని భావించారు. దీంతో అధికారులు రైస్ మిల్లులకు నోటీస్లు ఇవ్వడంతోపాటు కొన్ని చోట్ల రైస్ మిల్లులను సీజ్ చేస్తూ ఒత్తిడి పెంచారు. అయినప్పటికీ లాభం లేకపోవడంతో కొత్తగా బాధ్యతలు తీసుకున్న సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రూట్మార్చారు.
సీఎంఆర్ బియ్యం ఇవ్వని రైస్ మిల్లుల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్తనిఖీలకు ఆదేశించారు. ఎప్పట్లాగే కేటాయించిన వడ్లు, మిల్లుల్లో నిల్వలకు మధ్య ఉన్న తేడాకే పరిమితం కాకుండా లోతుగా దర్యాప్తు చేయించారు. ఆయా రైస్ మిల్లులకు వడ్ల బస్తాలు ఏ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చాయి? వడ్లు అమ్మిన రైతుల పేర్లేంటి? వంటి వివరాలనూ క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు.
దీంతో రైస్ మిల్లర్లు వడ్లు కొనకుండానే చేసిన దందాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగుచూస్తు న్నాయి. మొత్తం మీద 2014 నుంచి ఇప్పటి వరకు సీఎంఆర్ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న రైస్మిల్లర్లలో సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఇలాగే కాజేసినట్లు ఎంక్వైరీ ఆఫీసర్లు చెప్తున్నారు.
ఇవిగో ఆధారాలు..
హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి చెందిన కాట్రపల్లి, పత్తిపాక, శాయంపేట వడ్ల కొనుగోలు సెంటర్ల నుంచి కమలాపూర్ మండలంలోని సాంబశివ రైస్ మిల్లుకు రూ.1.70 కోట్ల విలువ చేసే వడ్లు పంపినట్లుగా రికార్డులున్నాయి. ఈ రైస్ మిల్లు ఓనర్ సీఎంఆర్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడు. దీంతో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు రైస్మిల్లును తనిఖీ చేస్తే.. అక్కడ వడ్లుగానీ, బియ్యం గానీ లేవు.
దీంతో ట్రక్ షీట్లను పరిశీలిస్తే రైతుల పేర్లకు బదులు రైస్ మిల్లు ఓనర్ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లు ఉన్నాయి. వేరే మండలానికి చెందిన వారు ఇక్కడ ఎట్లా వడ్లు అమ్మారని సెంటర్ నిర్వాహకులను, అగ్రికల్చరల్, సివిల్ సప్లయ్ ఆఫీసర్లను ప్రశ్నిస్తే.. అందరూ నీళ్లు నమిలారు. ఈ ఒక్క రైస్ మిల్లులోనే రూ.1.70 కోట్ల స్కామ్ జరిగినట్లు ఆఫీసర్లు నిర్ధారించి.. అందరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, నిధులు రికవరీ చేయడానికి సర్కారుకు నివేదిక సమర్పించారు.
మహబూబాబాద్ జిల్లాలోని పలు రైస్ మిల్లులపై రాష్ట్ర సివిల్ సప్లయ్స్, టాస్క్ ఫోర్స్ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించారు. మూడు రైస్మిల్లులకు రూ. 24 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం చేసినట్లు రికార్డుల్లో ఉన్నప్పటికీ ఎక్కడా వడ్లు, బియ్యం లేవు. దీంతో ముగ్గురు రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన కొందరు బడా వ్యాపారులు కేవలం ఈ తరహా దందా కోసమే రైస్ మిల్లులను ఏర్పాటు చేసినట్లు వెలుగుచూసింది. రూ. 2 కోట్ల నుంచి 3 కోట్లతో రైస్ మిల్లులను ఏర్పాటు చేసి.. సీఎంఆర్ పేరుతో రూ.20 కోట్ల వరకు కాజేసినట్లు తేలింది.
ముథోల్ మండలంలోని ముద్గల్ గ్రామంలో గల ఏషియన్ రైస్ మిల్తో పాటు శ్రీ గణపతి రైస్ మిల్లులో రూ.20 కోట్లకు పైగా ఫేక్ట్రక్షీట్ల స్కామ్ జరిగినట్లు ఆఫీసర్లు తేల్చారు. ఈ రెండు రైస్ మిల్లులను కూడా బడా వ్యాపారులు తమ బినామీ పేర్లతో నిర్వహిస్తున్నట్లు బయటపడింది.
మెదక్ జిల్లాలో బాయిల్డ్ రైస్మిల్లుల నుంచి రూ. 13.13 కోట్లు, రా రైస్ మిల్లుల నుంచి రూ. 26.56 కోట్ల విలువైన ధాన్యం కేటాయించినట్లు రికార్డుల్లో ఉన్నా ఎక్కడా వడ్లు లేవు. బియ్యం కేటాయించడం లేదు. దీంతో ఈ జిల్లాలో 24 రైస్ మిల్లులపై ఆఫీసర్లు లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 51 మంది మిల్లర్లు పదేండ్లలో రూ.270 కోట్ల విలువైన ధాన్యం కేటాయించుకున్నట్లు రికార్డుల్లో ఉంది. సీఎంఆర్ఇవ్వకపోవడంతో వారిపై వడ్డీ, పెనాల్టీలు వేయగా, ఆ మొత్తం రూ.372 కోట్లకు చేరింది. ఏ ఒక్క మిల్లులోనూ వడ్లుగానీ బియ్యంగానీ లేవు.
దీంతో ఇక్కడ కూడా ఫేక్ట్రక్షీట్ల దందా జరిగినట్లు అనుమానిస్తున్న అధికారులు లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు. బోధన్లోని ఒక మాజీ ప్రజాప్రతినిధి రూ.160 కోట్లు కాజేసినట్లు అధికారులు గుర్తించారు. గత బీఆర్ఎస్హయాంలో తన పలుకుబడి ఉపయోగించి 2021-22, 2022-23 సీజన్లలో ఈ దందాకు పాల్పడినట్లు తేల్చారు.