
మేడ్చల్: కుత్బుల్లాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరా వాహనంపై తీసుకెళ్తున్న ఇనుప చువ్వలు లోడ్ ఎక్కువ కావడంతో ముందున్న కారుపై పడ్డాయి. అద్దాలు పగిలిపోయి ఇనుప చువ్వలు కారులోపలికి చొచ్చుకెళ్లాయి. ఈ ఘటనలో కారులో ఉన్న వారికి ఏమైనా జరిగిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదంతో కుత్బుల్లాపూర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. షాపూర్ నగర్ చౌరస్తా నుంచి ఐడీపీఎల్ మెయిన్ రోడ్ వరకు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అరగంట పాటు అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుంది. ముందుకు కదలలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇంత జరుగుతున్నా.. ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు కనబడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన బొలెరా, కారును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.