సిద్దిపేట టౌన్, వెలుగు: సమాజంలో జరుగుతున్న నేరాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కరమని, రాష్ట్రంలో ఏడాదికి సగటున 800 హత్యలు జరుగుతుంటే, దాదాపు 8వేల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ శిఖా గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో ‘అరైవ్ అలైవ్’లో భాగంగా నిర్వహించిన రహదారి భద్రత అవగాహన సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కలెక్టర్ కె.హైమావతి, సీపీ రష్మి పెరుమాళ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అత్యధిక ప్రమాదాలు గ్రామీణ ప్రాంతాల రోడ్లపైనే జరుగుతున్నాయని, అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడమే కారణమన్నారు. అనంతరం పలువురికి డీజీపీ ఉచిత కంటి అద్దాలు, మెడికల్ కిట్లు పంపిణీ చేశారు.
