నారాయణ కాలేజీ గోడదూకి బర్త్‌డే పార్టీకెళ్లిన ఇద్దరు మృతి

నారాయణ కాలేజీ గోడదూకి బర్త్‌డే పార్టీకెళ్లిన ఇద్దరు మృతి

తిరుగు ప్రయాణంలో ప్రమాదం
ఇద్దరు విద్యార్థులు మృతి

మాదాపూర్‌లోని నారాయణ కాలేజీలో దారుణం జరిగింది. మెడికల్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న 9 మంది విద్యార్థులు ఫ్రెండ్ బర్త్ డే వేడుకల కోసం కాలేజీ క్యాంపస్ గోడదూకి బయటికి వెళ్ళారు. ఫ్రెండ్ బర్త్ డే జరుపుకొని తిరిగి కాలేజీకి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోగా.. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

మాదాపూర్‌లోని నారాయణ కాలేజీకి చెందిన 9 మంది విద్యార్థులు స్నేహితుడి పుట్టినరోజు వేడుకల కోసం కాలేజీ గోడదూకి కారులో రాజేంద్రనగర్ వెళ్లారు. విద్యార్థులంతా బర్త్‌డేకి టిఎస్ 07 ఈబి 3680 సఫారీ స్ట్రోమ్ కారులో వెళ్లారు. బర్త్‌డే వేడుకలు ముగిసిన తర్వాత వారంతా తిరిగి అదే కారులో కాలేజీకి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు ఆరంఘర్ చౌరస్తా వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఉదయ్, తరుణ్ అనే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో శశాంక్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా.. కాలేజీ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థులంతా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. కారును సడన్ బ్రేక్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.