అంబర్ పేట, వెలుగు: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించి.. బీఆర్ఎస్, బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని అంబర్పేట సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గోల్నాకలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటికి పాదయాత్ర చేస్తూ వెళ్లారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేయబోయే పనులను వివరించారు.
ఈ సందర్భంగా రోహిన్ రెడ్డి మాట్లాడుతూ.. హామీల అమలులో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు. అంబర్ పేటలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేసి విజయ ఢంకా మోగించాలని రోహిన్ రెడ్డి సూచించారు.