
న్యూఢిల్లీ: సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడం వల్ల టీమిండియాకు కొంత ఇబ్బందేనని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అంగీకరించాడు. అయితే వాళ్ల రిటైర్మెంట్తో బాధ్యత తీసుకోవడానికి ఇతరులకు ఇదో మంచి అవకాశమన్నాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్కు టీమ్ను ఎంపిక చేయనున్న నేపథ్యంలో గౌతీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఆటను ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు ముగించాలనేది ప్లేయర్ల వ్యక్తిగత నిర్ణయం. ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఇతరులకు లేదు. అది కోచ్ అయినా, సెలెక్టర్ అయినా సరే. రిటైర్మెంట్ నిర్ణయం అనేది ప్లేయర్ మనసు నుంచే వస్తుంది’ అని గౌతీ పేర్కొన్నాడు.
రోహిత్, కోహ్లీ నిష్క్రమణతో టీమిండియాకు కొత్త టెస్ట్ కెప్టెన్ అవసరం మాత్రమే కాకుండా, ఇద్దరు సీనియర్ ప్లేయర్లు లేని లోటును పూడ్చడం అంత సులభం కాదని కోచ్ వ్యాఖ్యానించాడు. ‘ఇద్దరు సీనియర్లు లేకుండా, వాళ్ల అనుభవం లేకుండా మనం ఆడే పరిస్థితి వచ్చింది. అయితే తాము సిద్ధంగా ఉన్నామని ఇతర ప్లేయర్లు తమను తాము నిరూపించుకునేందుకు ఇది ఓ అవకాశమని నేను నమ్ముతా. కాకపోతే వాళ్లిద్దరూ లేకుండా ఆడటం కాస్త కష్టమైన పనే’ అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
గతంలో స్టార్ పేసర్ బుమ్రా లేకుండానే చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన అంశాన్ని ఈ సందర్భంగా గౌతీ ప్రస్తావించాడు. ‘చాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా లేడు. అప్పుడు కూడా నేను ఒక్కటే చెప్పా. ఎవరైనా ఒకరు లేకపోతే జట్టుకు ప్రత్యేకంగా చేసే చాన్స్ ఇతరులకు వస్తుంది. ఆ అవకాశం కోసం వేచి చూసే ఇతర ప్లేయర్లు ఉంటారని నేను బలంగా నమ్ముతా’ అని గంభీర్ వివరించాడు.
2027 వన్డే వరల్డ్ కప్లో రోహిత్, కోహ్లీ ఆడతారా..? అన్న దానిపై గంభీర్ పెద్దగా స్పందించలేదు. మెగా టోర్నీకి చాలా సమయముందన్నాడు. ‘ప్రస్తుతానికి ఇంగ్లండ్ సిరీస్, తర్వాత టీ20 వరల్డ్ కప్పైనే మా దృష్టి ఉంది. 2027 వరల్డ్ కప్కు ఇంకా రెండున్నరేళ్లు ఉంది. అప్పటివరకు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ మంచి పెర్ఫామెన్స్ ఇస్తే కచ్చితంగా టీమ్లో ఉంటారని నేను చెప్పగలను. వయసు అనేది కేవలం ఓ సంఖ్యగానే నేను భావిస్తా’ అని హెడ్ కోచ్ చెప్పుకొచ్చాడు.