
- ఒకరి కెప్టెన్సీలో మరొకరు ఆడేందుకు కోహ్లీ, రోహిత్ నో?
- సౌతాఫ్రికాతోటెస్ట్లకు రోహిత్, వన్డేలకు విరాట్ దూరం!
- గాయంతో హిట్మ్యాన్ ఔట్..
- కూతురు బర్త్ డే పేరుతో రెస్ట్ కోరిన కోహ్లీ!
న్యూఢిల్లీ:వన్డే కెప్టెన్సీ మార్పు ఇండియా క్రికెట్ టీమ్లో.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య అగ్గిరాజేసింది. తనను తప్పించి రోహిత్ శర్మకు వన్డే నాయకత్వం అప్పగించడం, బోనస్గా టెస్టు వైస్ కెప్టెన్సీ ఇవ్వడంపై విరాట్ కోహ్లీ గుస్సాగా ఉండగా.. బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించడం లేదని కోహ్లీపై రోహిత్ అంతే ఆగ్రహంగా ఉన్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడేందుకు కూడా ఇష్టపడటం లేదట. ఒకరి కెప్టెన్సీలో మరొకరు ఆడేందుకు నిరాకరిస్తున్నారని తెలుస్తోంది. సౌతాఫ్రికా టూర్లో భాగంగా ఈ నెల 26 నుంచి జరిగే టెస్టు సిరీస్కు రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం అవగా.. ఇప్పుడు వన్డే సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ తప్పకుంటున్నాడు. తన కూతురు వామిక ఫస్ట్ బర్త్డేను ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలని చెబుతూ వన్డేలకు దూరంగా ఉంటానని, ఈ మేరకు సిరీస్ టైమ్లో తనకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐని కోహ్లీ రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. కానీ విరాట్ బ్రేక్ తీసుకుంటున్నాడని బోర్డు అధికారులు కొందరు స్పష్టం చేశారు. కాగా, గాయంతో రోహిత్ టెస్టు సిరీస్కు దూరమైనట్టు ప్రకటన వచ్చేదాకా కోహ్లీ ముంబైలో ఇండియా టెస్టు టీమ్కు ఏర్పాటు చేసిన బయో బబుల్లోకి ఎంటర్ అవ్వకపోవడం అనుమానాలను పెంచుతోంది. మరోపక్క టెస్టు టీమ్ వైస్ కెప్టెన్ రోహిత్ నిజంగానే గాయపడ్డాడా అనేదానిపై కూడా డౌట్స్ మొదలయ్యాయి.
కూతురు బర్త్డే టైమ్లో వందో టెస్ట్
విరాట్ కోహ్లీ కూతురు వామిక పుట్టిన రోజు జనవరి 11న కాగా, అదే రోజున సౌతాఫ్రికాతో మూడో టెస్టు స్టార్ట్ అవుతుంది. ఇది కోహ్లీకి వందో టెస్ట్ కావడం విశేషం. జనవరి 19 నుంచి ఇండియా, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ స్టార్ట్ అవ్వనుంది. ఒకవేళ కూతురు ఫస్ట్ బర్త్డే కోసం లీవ్ తీసుకోవాలని కోహ్లీ భావిస్తే... 11కు ముందే తీసుకోవాలి. కానీ, బర్త్డే అయిన వారం తర్వాత మొదలయ్యే వన్డే సిరీస్కు దూరంగా ఉండాలనుకోవడం చూస్తే రోహిత్ కెప్టెన్సీలో ఆడటం తనకు ఇష్టం లేదన్న అనుమానాలు కలుగుతున్నాయి. పైగా, టీ20 వరల్డ్కప్ తర్వాత న్యూజిలాండ్తో టీ20 సిరీస్, ఫస్ట్ టెస్టుకు రెస్ట్ ఇవ్వాలని కోహ్లీ చాలా రోజులముందే బోర్డు, సెలక్షన్ కమిటీని కోరాడు. కానీ, ఇప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వన్డే సిరీస్కు టీమ్ను ఎంపిక చేసేటైమ్లో ఆడనని చెప్పడం సరికాదన్న అభిప్రాయాలున్నాయి.
నేడు మీడియా ముందుకు విరాట్
కోహ్లీ బ్రేక్ తీసుకోవడం తప్పు కాద ని.. విరామం తీసుకుంటున్న టైమింగే కరెక్ట్ కాదని ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ ట్వీట్ చేశాడు. జట్టులో ఏదో జరుగుతోందన్న ఊహలకు ఇది ఊతమిచ్చేలా ఉందన్నాడు. కాగా, కోహ్లీ తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసే సౌతాఫ్రికాతో వెళుతున్నాడని.. బ్రేక్ తీసుకోవాలనుకుంటే అది తన ఇష్టమని బీసీసీఐకి చెందిన మరో అధికారి అన్నారు. ఇప్పటికైతే తను వన్డేలు ఆడుతాడని చెప్పారు. మరోవైపు టీ20 కెప్టెన్గా దిగిపోయిన తర్వాత ఫస్ట్ టైమ్ కోహ్లీ బుధవారం మీడియా ముందుకొస్తున్నాడు. టెస్టు సిరీస్ కోసం సౌతాఫ్రికా బయల్దేరే ముందు తను ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడనున్నాడు. ఇందులో అన్ని అంశాలపై క్లారిటీ రానుంది. సౌతాఫ్రికాతో వన్డేలు ఆడాలని బీసీసీఐ నుంచి వస్తున్న రిక్వెస్ట్కు కోహ్లీ ఒప్పుకునే చాన్సుంది. ఒకవేళ బ్రేక్ తీసుకునేందుకే మొగ్గు చూపితే అందుకు కారణాలను వెల్లడించొచ్చు.
‘ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడుతం’
కోహ్లీ తీరుపై బీసీసీఐ పెద్దలు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థాయి వ్యక్తి ఇలా చేయడం తగదని అంటున్నారు. ‘వన్డే కెప్టెన్గా తనను తప్పించడాన్ని విరాట్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే ఫ్యామిలీ రీజన్స్ పేరుతో సఫారీలతో వన్డే సిరీస్కు దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. సౌతాఫ్రికా టూర్ తర్వాత ఇద్దరు కెప్టెన్లను కూర్చోబెట్టి మాట్లాడతాం. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం. వన్డే కెప్టెన్ను మార్చడం అనేది జట్టు గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం. కోహ్లీ ఇలా తన స్వార్థం చూసుకోవడం కరెక్ట్ కాదు. ప్లేయర్ల కంటే జట్టే ముందు అని చెప్పి.. టీమ్ కోసం కోహ్లీ వెలకట్టలేని సేవలందించాడు. అలాంటి విరాట్ ఇలా చేయడం నిజంగా దురదృష్టకరం. ఈ సమస్య వల్ల జట్టులో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం ముఖ్యం. విరాట్, రోహిత్ జట్టులో బెస్ట్ ప్లేయర్లు. మూడు ఫార్మాట్స్లోనూ ముఖ్యమైన ఆటగాళ్లు. వాళ్లిద్దరూ కలిసి ఉండాలి’ అని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.