
ముంబై: వాంఖడే స్టేడియంలో జరిగిన వన్డేల్లో టీమిండియా జెర్సీతో ఆడటం తనకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని లెజెండరీ రోహిత్ శర్మ అన్నాడు. అలాంటి స్టేడియంలో తన పేరుమీద స్టాండ్ ఉండటం చాలా గొప్పగా ఉందన్నాడు. వాంఖడేలో రోహిత్ శర్మ పేరుతో ఉన్న స్టాండ్ను మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో కలిసి హిట్మ్యాన్ తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ, గురునాథ్ శర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ‘ఈ రోజు ఏం జరుగుతుందో నేనెప్పుడూ ఊహించలేదు. ఆటలో మైలురాళ్లు సాధించడానికి ఎంతో ప్రయత్నిస్తారు. కానీ ఇలాంటి సందర్భం మాత్రం చాలా స్పెషల్.
ఎందుకంటే వాంఖడే ఓ ఐకానిక్ స్టేడియం. ఇక్కడ నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అలాంటి చోట నా పేరుతో స్టాండ్ ఉండటం చాలా గొప్ప అనుభూతిని ఇస్తోంది. దీన్ని నేను మాటల్లో వ్యక్తపర్చలేను. ఇందుకు చాలా కృతజ్ఞుడిని. ఇప్పటికీ నేను ఆడుతూనే ఉన్నా. రెండు ఫార్మాట్ల నుంచి మాత్రమే తప్పుకున్నా. 21న ముంబై ఇండియన్స్ తరఫున ఆడేటప్పుడు ఈ స్టాండ్ ఉండటం చాలా అద్భుతంగా అనిపిస్తోంది. దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు అది మరింత ప్రత్యేకంగా ఉంటుంది’ అని రోహిత్ భావోద్వేగంతో వ్యాఖ్యానించాడు. తన కెరీర్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబానికి హిట్మ్యాన్ కృతజ్ఞతలు చెప్పాడు.
‘ఈ గొప్ప సమయంలో నా తల్లిదండ్రులు, భార్య, సోదరుడు ఉండటం మరింత ప్రత్యేకంగా ఉంది. వారు నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నా ప్రత్యేక బృందం ముంబై ఇండియన్స్ కూడా ఇక్కడే ఉంది. నా స్పీచ్ అయిన వెంబడే ట్రెయినింగ్కు వెళ్లడానికి వేచి చూస్తోంది. శరద్ పవార్ సాహెబ్, ఫడ్నవిస్కి ప్రత్యేక ధన్యవాదాలు.
ఇది నాకు చాలా ప్రత్యేకమైన రోజు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఎంసీఏ కొత్త స్టేడియం కోసం ప్రతిపాదనలు పంపితే తమ ప్రభుత్వం భూమి కేటాయించేందుకు సిద్ధంగా ఉందని ఫడ్నవిస్ అన్నారు. ‘మా ఐకానిక్ బ్యాటర్, కెప్టెన్, నాకు ఇష్టమైన వారిలో ఒకరు.. తన బ్యాటింగ్తో మంత్రముగ్దులను చేసే వ్యక్తి ఇక్కడ ఉన్నారని’ ఫడ్నవిస్.. రోహిత్పై ప్రశంసలు
కురిపించారు.