Rohit Sharma: ఆస్ట్రేలియాపై రివేంజ్ తీర్చుకోవాలనే ఆ రోజు అలా ఆడాను: రోహిత్ శర్మ

Rohit Sharma: ఆస్ట్రేలియాపై రివేంజ్ తీర్చుకోవాలనే ఆ రోజు అలా ఆడాను: రోహిత్ శర్మ

భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి జీర్ణించుకోలేనిది. టోర్నీ మొత్తం అద్భుత ఆటతీరును ప్రదర్శించిన భారత క్రికెట్ జట్టు ఫైనల్లో ఆసీస్ జట్టుపై అనూహ్యంగా ఓడింది. టీమిండియా జోరును చూస్తే 12 ఏళ్ళ తర్వాత వరల్డ్ గెలుస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. 241 పరుగుల లక్ష్యంతో దిగిన ఆసీస్ జట్టు ప్రారంభంలో మూడు వికెట్లు కోల్పోయినా హెడ్(137), లబుషేన్(58) భారీ భాగస్వామ్యంతో ఆరోసారి వరల్డ్ కప్ గెలిచింది. ఈవిజయంతో భారత ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఈ ఓటమికి ఆసీస్ పై రివెంజ్ తీర్చుకున్నామని రోహిత్ వెల్లడించాడు.

స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.. "నవంబర్ 19న జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మమ్మల్ని ఓడించి నిరాశకు గురి చేసింది. దీనికి ప్రతిఫలంగా ఆస్ట్రేలియాకు ఏదైనా రివెంజ్ రూపంలో ఒక బహుమతి ఇవ్వాలని అనుకున్నాం. 2024 టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. ఆ మ్యాచ్ గెలిస్తే ఆస్ట్రేలియా ఈ టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమిస్తుందని మా మనసులో అనుకున్నాం" అని స్టార్ స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ అన్నారు.

2024 టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై రోహిత్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 92 పరుగులు చేశాడు.   ఈ మ్యాచ్ లో రోహిత్ ఇన్నింగ్స్ తప్ప చెప్పడానికి మరొకటి లేదు. అంతలా హిట్‌మ్యాన్ విధ్వంసం సాగింది. హేజిల్‌వుడ్ వేసిన మోదటి ఓవర్‌లో కాస్త తడబడినట్లు కనిపించిన భారత కెప్టెన్.. స్టార్క్ వేసిన మూడో ఓవర్‌లో ఏకంగా 29 పరుగులు రాబట్టాడు. అక్కడినుంచి రోహిత్ క్రీజులో ఉన్నంతసేపు భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 19 బంతుల్లోనే అర్ధ సెంచ‌రీ పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 92 పరుగుల వద్ద స్టార్క్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

"2024 టీ20 వరల్డ్ కప్ గెలవడం నా కెరీర్ లో గొప్ప క్షణం. ఆస్ట్రేలియాపై ఆడిన 92 పరుగుల ఇన్నింగ్స్ నా టీ20 కెరీర్ లో బెస్ట్ ఇన్నింగ్స్. హార్దిక్ ను నమ్మినందుకున్ అతని బాధ్యతను సమర్ధవంతంగా పోషించాడు. విరాట్ కోహ్లీ అనుభవం ఫైనల్లో కలిసొచ్చింది. కోహ్లీ చాలా గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ గురించి ఎవరూ మాట్లాడకపోయినా కీలక దశలో అతను చేసిన 47 పరుగులు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి". అని 2024 టీ20 వరల్డ్ కప్ గురించి రోహిత్ తన అనుభవాలను షేర్ చేసుకున్నాడు.