Rohit Sharma: భారత్–పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్‌ చూసేందుకు శ్రీలంకకు రోహిత్ శర్మ..?

Rohit Sharma: భారత్–పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్‌ చూసేందుకు శ్రీలంకకు రోహిత్ శర్మ..?

Rohit Sharma: భారత్–పాకిస్తాన్ మధ్య జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్‌కు ముందే ఆసక్తి మరింత పెరిగింది. ఈ ఉత్కంఠభరిత వాతావరణంలో మాజీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరు ఒక్కసారిగా చర్చలోకి వచ్చింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హిట్ మ్యాన్ తన భార్య రితికాతో కలిసి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇవాళ కొలంబోలో జరగనున్న భారత్–పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు శ్రీలంకకు అతడు వెళ్తున్నాడా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. రోహిత్ ఎటు వెళ్తున్నాడు అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

రోహిత్ శర్మ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌కు అధికారిక బ్రాండ్ అంబాసడర్‌గా కొనసాగుతున్నారు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, ఈ టోర్నమెంట్ తో ఆయనకు దగ్గరి అనుబంధం ఇంకా కొనసాగుతోంది. ఇటీవల ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్–అమెరికా మ్యాచ్ ప్రారంభ సమయంలో టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో రోహిత్ మైదానంలోకి రావడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ ట్రోఫీనే ఆయన 2024లో వెస్టిండీస్‌లోని బార్బడోస్‌ వేదికగా దక్షిణాఫ్రికాపై భారత్‌ను గెలిపించి ఎత్తుకున్నారు. ఆ విజయంతో టీమిండియాకు 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ దక్కింది.

భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌కు రోహిత్ హాజరవుతాడేమోనని అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. చివరిసారిగా ఈ రెండు జట్లు 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నాయి. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి టీమిండియాను గెలిపించాడు. రాజకీయాలు, వివాదాలు అన్నీ పక్కనపెట్టి, భారత్– పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. టీ20 ప్రపంచకప్‌లో ఇది అతిపెద్ద మ్యాచ్‌గా నిలుస్తోంది.  ఈ టోర్నీలో ఇరు జట్లు రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ గెలిచాయి. భారత్ నాలుగు పాయింట్లతో పాటు మెరుగైన నెట్ రన్‌రేట్‌తో గ్రూప్-Aలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. పాకిస్తాన్ రెండో స్థానంలో నిలిచింది. సూపర్–8కు అర్హతతో పాటు గ్రూప్ టాపర్ ఎవరనేది ఈ మ్యాచ్‌తో తేలిపోనుంది.