
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వివాదాస్పద రివ్యూ కోరి విమర్శల పాలవుతున్నాడు. గురువారం (మే 1) మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రెండో ఓవర్లో ఈ సంఘటనచోటు చేసుకుంది. రెండో ఓవర్ ఐదో బంతికి ఫజల్హాక్ ఫరూఖీ లెగ్ సైడ్ వేసిన బంతిని రోహిత్ ఆడడంలో విఫలమయ్యాడు. హిట్ మ్యాన్ ప్యాడ్లకు తగిలిన ఈ బంతిని రాజస్థాన్ రాయల్స్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసింది. అంపైర్ వెంటనే ఔటిచ్చాడు.
ఈ దశలో రోహిత్ శర్మ DRS తీసుకునే ఆలోచనలో కనిపించాడు. సహచరుడు రికెల్ టన్ దగ్గరకు వెళ్లి మాట్లాడుతున్నాడు. ఈ లోపు DRS సమయం ముగిసింది. టైం కౌంట్ డౌన్ 0 పడిన తర్వాత రోహిత్ అంపైర్ ను రివ్యూ కోరాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ లో ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ కు సిగ్నల్ ఇచ్చాడు. బాల్-ట్రాకర్ పిచ్ ఔట్ సైడ్ పడినట్టు చూపించడంతో రోహిత్ నాటౌట్ గా అంపైర్లు ప్రకటించారు. దీంతో 7 పరుగుల వద్ద రోహిత్ బతికిపోయాడు. ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా రోహిత్ శర్మ 36 బంతుల్లో 9 ఫోర్లతో 53 పరుగులు చేశాడు.
I’m a die-hard fan of Rohit Sharma, but this is a complete fixing, bro. I hope RR wins this match and Mumbai doesn’t win the final — whichever team reaches the final, let them win instead.#MIvsRR pic.twitter.com/y9Tuq9Nsgg
— Priyanshu Verma (@iPriyanshVerma) May 1, 2025
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు రికెల్ టన్ (38 బంతుల్లో 61:7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53:9 ఫోర్లు ) మెరుపులకు తోడు సూర్య కుమార్ యాదవ్(23 బంతుల్లో 48:4 ఫోర్లు, 3 సిక్సులు) హార్దిక్ పాండ్య(23 బంతుల్లో 48: 6 ఫోర్లు, సిక్సర్) దంచి కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ లో తీక్షణ, పరాగ్ చెరో వికెట్ తీసుకున్నారు.