
హైదరాబాద్, వెలుగు: ఏపీ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవంలో ముగ్గురు నలుగురు వైఎస్సార్సీపీ కీలక ఎమ్మెల్యేలు కనిపించలేదు. అందులో రోజా ఒకరు. శుక్రవారం సాయంత్రమే ఆమె అమరావతి నుంచి వెళ్లిపోయినట్లు కొందరు నేతలు చర్చించుకోవడం కనిపించింది. మంత్రి పదవి దక్కకపోవడంతోనే రోజా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. రోజాకు జగన్ కేబినెట్లో మంత్రి పదవి దక్కుతుందని మొదటి నుంచి ఆమె అనుచరులు కూడా బలంగా నమ్మారు. కానీ.. కేబినెట్ లిస్టులో పేరు కనిపించలేదు. శుక్రవారం జరిగిన వైఎస్సార్ఎల్పీ సమావేశానికి వచ్చిన రోజా.. మీడియాతోనూ మాట్లాడారు. జగన్ ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వర్తిస్తానని తెలిపారు. సామాజిక వర్గాల ప్రాధాన్యతల వల్లే రోజాకు కేబినెట్లో చోటు దక్కలేదని తెలుస్తోంది. తొమ్మిదేళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న రోజాకు మంచి పదవే దక్కుతుందని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, భూమన కరుణాకర్రెడ్డి వంటి వారికి కూడా కేబినెట్లో చోటు దక్కుతుందని ప్రచారం జరిగినా.. వారికీ చోటు లభించలేదు.