గాంధీనగర్: నేషనల్ గేమ్స్లో తెలంగాణ రోలర్ స్కేటర్ రియా సబూ రాష్ట్రానికి తొలి గోల్డ్ అందించింది. మెన్స్ నెట్బాల్ టీమ్ సిల్వర్ మెడల్ సాధించింది. శుక్రవారం జరిగిన విమెన్స్ ఆర్టిస్టిక్ క్వాడ్ ఫ్రీ స్టయిల్ స్కేటింగ్లో రియా 112 స్కోరుతో గోల్డ్ కైవసం చేసుకుంది. 19 ఏండ్ల రియా.. గీతం యూనివర్సిటీ (హైదరాబాద్)లో సైకాలజీ చదువుతోంది. తెలంగాణకు తొలి గోల్డ్ అందించడం తనకు చాలా ఆనందంగా ఉందని ఆమె చెప్పింది. ఇక, నెట్బాల్ మెన్స్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ 73–75 తేడాతో హర్యానా చేతిలో పోరాడి ఓడిపోయింది. తొలి క్వార్టర్లో 16–9తో ఆధిక్యం సాధించిన జట్టు తర్వాత తడబడింది. హోరాహోరీగా సాగిన ఆఖరి క్వార్టర్లో 29–28తో నిలిచినా ఓవరాల్ స్కోరులో వెనుకబడి సిల్వర్తో సరిపెట్టింది.
మీరాబాయి, ఎలవెనిల్కు స్వర్ణాలు
పలువురు స్టార్ అథ్లెట్లు గేమ్స్లో సత్తా చాటారు. లిఫ్టర్ మీరాబాయి చాను (మణిపూర్) విమెన్స్ 49 కేజీ కేటగిరీలో 191 కిలోల బరువెత్తి టాప్ ప్లేస్ సాధించింది. గుజరాత్ స్టార్ షూటర్ ఎలవెనిల్ వలారివన్ విమెన్స్ 10 మీ. ఎయిర్ రైఫిల్లో 16–10తో తిటోత్తమ సేన్ (కర్నాటక)ను ఓడించి గోల్డ్ నెగ్గింది. మెన్స్ 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో అనీశ్ (హర్యానా) స్వర్ణం గెలిచాడు. రెజ్లర్ దివ్యా కక్రాన్ (యూపీ), ఫెన్సర్ భవానీ దేవి (తమిళనాడు) కూడా గోల్డ్ సాధించారు.