
గురువారం (మే 29) పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ లో అదరగొడుతుంది. చండీఘర్ వేదికగా ముల్లన్పూర్ లో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి మొదట పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆరంభం నుంచే బెంగళూరు పేసర్లు చెలరేగారు. 50 పరుగులకే నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ పై పట్టు బిగించారు. హేజల్ వుడ్, యష్ దయాల్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. భువనేశ్వర్ కు ఒక వికెట్ దక్కింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ రెండో ఓవర్లోనే యష్ దయాల్ బిగ్ షాక్ ఇచ్చాడు. ఫామ్ లో ఉన్న ప్రియాంష్ ఆర్య 7 పరుగులే చేసి దయాల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో భువీ పంజాబ్ కు మరో ఝలక్ ఇచ్చాడు. ఒక చక్కటి లెంగ్త్ బంతితో ప్రభ్ సిమ్రాన్ సింగ్ ను ఔట్ చేశాడు. ముందుకొచ్చి భారీ షాట్ ఆడాలని చూసిన సిమ్రాన్ సింగ్ (18) కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత హేజల్ వుడ్ శ్రేయాస్ అయ్యర్ (2), జోష్ ఇంగ్లిష్ (4) వికెట్లను తీసి పంజాబ్ ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు.
ఏడో ఓవర్లో దయాల్ నెహ్యాల్ వధేరాను క్లీన్ బౌల్డ్ చేయడంతో 50 పరుగులకే పంజాబ్ సగం జట్టును కోల్పోయింది. పంజాబ్ బ్యాటర్లందరూ చెత్త షాట్ సెలక్షన్ తో పెవిలియన్ కు చేరారు. ప్రస్తుతం పంజాబ్ 7 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజ్ లో మార్కస్ స్టోయినిస్ (10) ఉన్నారు.