బంగారం షోరూం గోడకు కన్నం వేసి.. రూ.25 కోట్ల నగలు దోపిడీ

బంగారం షోరూం గోడకు కన్నం వేసి.. రూ.25 కోట్ల నగలు దోపిడీ

దేశ రాజధాని ఢిల్లీలో భారీ దోపిడీ జరిగింది. జంగ్ పురా ఏరియా.. భోగల్ ప్రాంతంలోని ఉమ్రావ్ సింగ్ అనే నగల షాపు ఉంది. స్థానికంగా ఎంతో ఫేమస్ అయిన  ఈ బంగారం షోరూంలో భారీ దోపిడీ జరిగింది. షోరూం గోడకు కన్నం వేసి.. అందులో నుంచి లోపలికి వెళ్లిన దొంగలు.. 25 కోట్ల రూపాయల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత భద్రత ఉండే ఈ ప్రాంతంలోని.. ఓ బంగారం షోరూంలో దోపిడీ జరగటం సంచలనంగా మారింది. 

ఉమ్రావ్ సింగ్ గోల్డ్ షోరూం మూడు అంతస్తుల్లో ఉంటుంది. మెట్ల మార్గం ఉంది. 2023, సెప్టెంబర్ 25వ తేదీ అర్థరాత్రి.. దోపిడీ దొంగలు మెట్ల మార్గం వైపు ప్రవేశించారు. అక్కడి నుంచి షోరూం గోడను పగలగొట్టారు. మనిషి పట్టేంత రధ్రం వేశారు. అందులో నుంచి షోరూంలోకి ప్రవేశించారు. 

నగలు భద్రపరిచే స్ట్రాంగ్ రూంలోకి వెళ్లిన దొంగలు.. అక్కడ ఉన్న బంగారం, వజ్రాల ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వెండి వస్తువులను మాత్రం తీసుకెళ్లలేదు. దొంగిలించిన బంగారం విలువ 25 కోట్ల రూపాయల వరకు ఉంటుందని షోరూం యజమానులు చెబుతున్నారు.

ఉదయం షోరూంకు వచ్చిన షాపు యజమాని.. కరెంట్ ప్యానెల్ బోర్డు పగిలి ఉండటాన్ని గమనించి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన సీనియర్ పోలీస్ అధికారులు షోరూం మొత్తాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు వేలి ముద్రలు సేకరిస్తున్నారు. 

బంగారం షోరూంకు చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి.. అదే విధంగా అలారం కూడా ఉంది. ఇంత పెద్ద దోపిడీ జరిగితే అలారం ఎందుకు పని చేయలేదు.. ఎందుకు మోగలేదు అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. అదే విధంగా షోరూంలోని సీసీ కెమెరాలతోపాటు ఆ వీధిలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇంత పెద్ద దోపిడీ.. ఇటీవల కాలంలో జరగటం ఇదే అంటున్నారు పోలీసులు. బంగారం షోరూంలో అతి పెద్ద రాబరీగా చెబుతున్నారు. త్వరలోనే దోపిడీ దొంగలను పట్టుకుంటామని స్పష్టం చేస్తున్నారు పోలీసులు.