జూలూరుపాడు పోలీసులు రూ. 4.15 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

జూలూరుపాడు పోలీసులు రూ. 4.15 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

జూలూరుపాడు, వెలుగు : కంటెయినర్‌‌లో తరలిస్తున్న రూ. 4.15 కోట్ల విలువైన గంజాయిని మంగళవారం సాయంత్రం జూలూరుపాడు పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం జూలూరుపాడు పీఎస్‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌‌రాజ్‌‌ వెల్లడించారు. జూలూరుపాడు పోలీసులు మంగళవారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించిన ఓ ఐశ్చర్‌‌ కంటెయినర్‌‌ను ఆపారు. దానిని తనిఖీ చేయగా 830 కిలోల గంజాయి కనిపించింది.

దీంతో కంటెయినర్‌‌ డ్రైవర్లు, మధ్యప్రదేశ్‌‌కు చెందిన జస్రామ్‌‌, రాంకుమార్‌‌ను అదుపులోకి తీసుకోగా, మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. గంజాయిని ఏపీలోని తులసిపాక గ్రామంలో కొనుగోలు చేసి ఖమ్మం, హైదరాబాద్‌‌ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నారని చెప్పారు. గంజాయిని పట్టుకున్న జూలూరుపాడు పోలీసులను, టాస్క్‌‌ఫోర్స్‌‌ సిబ్బందిని అభినందిచారు. కార్యక్రమంలో సీఐ ఇంద్రసేనారెడ్డి, సీసీఎస్‌‌ సీఐ రమాకాంత్, ప్రవీణ్, ఎస్సైలు రవి, చంద్రశేఖర్‌‌ పాల్గొన్నారు.