
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆలయాల్లో భక్తుల దర్శనాల నిలిపివేతతో ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో చిన్న ఆలయాల్లో పని చేసే అర్చకులకు రూ. 5,000లు గ్రాంట్ రూపంలో చెల్లించనున్నట్లు ఆ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. దేవదాయ శాఖ నుంచి ఎలాంటి నెలవారీ జీతాలు పొందని, ధూప దీప నైవేద్యం వంటి పథకాల ద్వారా లబ్ధి పొందని వారికి అర్చక సంక్షేమ నిధి నుంచి ఈ సాయాన్ని చేయనున్నట్టు తెలిపారు.
సీఎం జగన్ నిర్ణయంతో 2,500 మంది అర్చకులకు లబ్ధి చేకూరనుంది. అర్చక సంక్షేమ నిధిపై సుమారు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల భారం పడనున్నట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు.