బిజినెస్ డెస్క్, వెలుగు: మార్కెట్ పతనం కొనసాగుతోంది. ఫెడ్ మినిట్స్ వెలువడే ముందు బేర్స్ ఆధిపత్యం కనిపించింది. బెంచ్మార్క్ ఇండెక్స్లు బుధవారం సెషన్లో ఒక్కటిన్నర శాతం మేర క్రాష్ అయ్యాయి. ఒకవైపు రష్యా–యూఎస్ మధ్య గొడవ మరింత ముదరగా, మరోవైపు బాండ్ ఈల్డ్లు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. వడ్డీ రేట్ల పెంపు భయాలు, ఇన్ఫ్లేషన్ పెరగడం వంటి అంశాలు గ్లోబల్ మార్కెట్లతో పాటు మన మార్కెట్లను కిందకి లాగాయి.
సెన్సెక్స్ బుధవారం సెషన్లో 928 పాయింట్లు (1.53 శాతం) పతనమై 59,745 వద్ద ముగిసింది. నిఫ్టీ 272 పాయింట్లు నష్టపోయి 17,554 వద్ద క్లోజయ్యింది. ఈ ఒక్క సెషన్లోనే బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.9 లక్షల కోట్లు తగ్గి రూ.261.2 లక్షల కోట్లకు పడింది. గత నాలుగు సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్లు తగ్గింది. ఈ టైమ్లో సెన్సెక్స్ 1,574 పాయింట్లు నష్టపోయింది. మెటల్స్, బ్యాంక్లు, ఫైనాన్షియల్ షేర్లు ఎక్కువగా పడ్డాయి.
అదానీ ఇన్వెస్టర్లకు రూ.51 వేల కోట్లు లాస్..
అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది. తాజాగా వికీపీడియా కూడా ఈ గ్రూప్పై ఆరోపణలు చేయడంతో అదానీ కంపెనీల షేర్లు బుధవారం భారీగా క్రాష్ అయ్యాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 11%, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ గ్రీన్ షేర్లు 5 % చొప్పున పతనమై లోయర్ సర్క్యూట్ టచ్ చేశాయి. అదానీ కంపెనీల ఇన్వెస్టర్లు సంపద బుధవారం సెషన్లో మరో రూ.51,294 కోట్లు తగ్గింది. మొత్తం అదానీ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.7.58 లక్షల కోట్లకు పడిపోయింది. హిండెన్బర్గ్ రిపోర్ట్ నెల క్రితం రిలీజ్ కాగా, అప్పటి నుంచి అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు సుమారు 70 శాతం మేర క్రాష్ అయ్యాయి. మరోవైపు అదానీ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన క్రెడిట్ రేటింగ్స్, ఇతర వివరాలను తమకు ఇవ్వాలని క్రెడిట్ రేటింగ్ కంపెనీలను సెబీ ఆదేశించింది.
మార్కెట్ పతనానికి కారణాలు..
1. గ్లోబల్ మార్కెట్స్ ఢమాల్
యూఎస్ మార్కెట్లు మంగళవారం సెషన్లో భారీగా క్రాష్ అయ్యాయి. ఎస్ అండ్ పీ 500 2 శాతం, నాస్డాక్ 2.5 శాతం, డోజొన్స్ 2.1 శాతం మేర క్రాష్ అయ్యాయి. యూఎస్ మార్కెట్లు పడడంతో బుధవారం సెషన్లో గ్లోబల్ మార్కెట్లన్నీ నెగెటివ్లో ట్రేడయ్యాయి. దీని ప్రభావం మన మార్కెట్లపై పడింది.
2. ముదురుతున్న జియోపొలిటికల్ టెన్షన్స్
ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా, యూఎస్ మధ్య గొడవ మరింత ముదిరింది. న్యూక్లియర్ బాంబులను వేయడానికి వెనకడుగేయమని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం స్పీచ్లో పేర్కొన్నారు. ఇందుకుగాను న్యూక్లియర్ ఆర్మ్స్ కంట్రోల్ ట్రీటీని రద్దు చేశారు. దీనికి బదులుగా కొత్త సిస్టమ్ను తీసుకొస్తామని అన్నారు. ‘యూఎస్, రష్యా మధ్య కోల్డ్ వార్ పరిస్థితులు నెలకొన్నాయి. దీని ఎఫెక్ట్ మార్కెట్పై పడింది. ఇది షార్ట్ టెర్మే అయినా, రష్యాపై ఆంక్షలు పెడతారనే భయాలు ఎక్కువయ్యాయి. ఈ ప్రభావం ఫుడ్, ఆయిల్ ఎక్స్పోర్ట్స్పై పడుతుంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు.
3. ఫెడ్ భయాలు..
ఫెడ్ మినిట్స్ బుధవారం వెలువడనున్నాయి. భవిష్యత్లో వడ్డీ రేట్లను ఎంత వరకు పెంచుతారనే సంకేతాలు ఈ మినిట్స్ ద్వారా వెలువడే అవకాశం ఉంది. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఫెడ్ మినిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘యూఎస్ మాక్రో ఎకనమిక్ డేటా గ్లోబల్గా ఈక్విటీ మార్కెట్లను నడిపిస్తోంది. ఇన్ఫ్లేషన్ అనుకున్నంత వేగంగా దిగిరాకపోవడంతో వడ్డీ రేట్లను ఫెడ్ అనుకున్నదాని కంటే ఎక్కువ పెంచుతుందనే భయాలు ఎక్కువయ్యాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు.
4. టెక్నికల్గా..
నిఫ్టీకి 17,350 దగ్గర సపోర్ట్ కనిపిస్తోంది. డైలీ ఛార్ట్లో ఈ ఇండెక్స్ పెద్ద రెడ్ క్యాండిల్ను ఏర్పాటు చేసింది.‘ 17,777 లెవెల్ కింద ఉన్నంత వరకు నిఫ్టీ 17,442, 17,350 వరకు పడే ఛాన్స్ ఉంది. 17,777, 17,850 కీలక రెసిస్టెన్స్ లెవెల్స్గా పనిచేస్తాయి’ అని ఎనలిస్టులు పేర్కొన్నారు.
5. విదేశీ ఇన్వెస్టర్లు ఎటువైపు?
విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.31 వేల కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. చైనా వంటి ఎమర్జింగ్ మార్కెట్లు ఇండియన్ మార్కెట్ల కంటే చౌకగా ఉండడంతో అటువైపు వెళ్తున్నారు. షార్ట్ టెర్మ్లో విదేశీ ఇన్వెస్టర్లు తమ షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకుంటున్నారని ఎనలిస్టులు చెబుతున్నారు. గత కొన్ని సెషన్ల నుంచి వీరు నెట్ బయ్యర్లుగా మారారని అన్నారు.
6. బాండ్ ఈల్డ్లు జూమ్..
యూఎస్ 2 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ మంగళవారం మూడు నెలల గరిష్టానికి చేరుకుంది. 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ 4 % పెరిగింది. దేశ 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ 7.428 % దగ్గర ట్రేడవుతోంది.
7. వడ్డీ రేట్ల పెంపు స్లోగా..
వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని స్లో చేస్తామని ఆర్బీఐ మినిట్స్లో గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. గతంలో పెంచిన వడ్డీ రేట్ల ప్రభావం వ్యవస్థలో కనిపించేందుకు టైమ్ ఇవ్వాలని అనుకుంటున్నామని, అలానే రేట్ల పెంపును ఆపేస్తే తొందరపాటు నిర్ణయం అవుతుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనిశ్చితి ఎక్కువగా ఉందని, ఇన్ఫ్లేషన్ ఎలా మారుతుందో తెలియడం లేదన్నారు. ఈసారి వడ్డీ రేట్లను 0.25% పెంచొచ్చనే సంకేతాలిచ్చారు.