విద్యుత్ శాఖ ఉద్యోగులకు రూ.కోటి ఇన్సూరెన్స్.. SBI తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

విద్యుత్ శాఖ ఉద్యోగులకు రూ.కోటి ఇన్సూరెన్స్.. SBI తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

విద్యుత్ శాఖ ఉద్యోగులకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం SBI తో ఒప్పందం చేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టీ మాట్లాడారు. విద్యుత్ శాఖ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద భీమ ఇస్తున్నామని చెప్పారు. ఇది ఉద్యోగుల్లో  ధైర్యం, నమ్మకాన్ని పెంచుతుందని అన్నారు. 

 తెలంగాణ ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.  రాష్ట్రంలో 2029-30 వరకు 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా విద్యుత్ శాఖ పనిచేస్తోందని అన్నారు. డిమాండ్ కు తగినట్లుగా ప్రొడక్షన్ పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. డిమాండ్ కు అనుగుణంగా ట్రాన్స్ మిషన్ ను అప్ డేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 

రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ శాఖదే మొదటి అడుగు అయి ఉండాలని ఈ సందర్భంగా భట్టీ అన్నారు. విద్యుత్ శాఖలో పని చేసే ప్రతి వ్యక్తికి కీలక బాధ్యత ఉందని.. లైన్ మెన్ నుంచి మినిస్టర్ వరకు అందరిదీ కీలక పాత్ర వహించాలని సూచించారు. రాష్ట్రానికి కావాల్సిన ఎనర్జీని ఉత్పత్తి చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రాణాలకు తెగించి కష్టపడి పనిచేస్తున్న విద్యుత్ శాఖ  ఉద్యోగుల కుటుంబాలు కూడా ధైర్యంగా, నమ్మకంగా ఉండేందుకు.. భరోసా కల్పించేందుకు బీమా ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు కోటి రూపాయల బీమా ఇస్తున్నందుకు అందరికీ అభినందనలు తెలిపారు.