మంచిప్ప ప్రాజెక్టు రీడిజైన్​ ఎవరి కోసం? : ఆర్​ఎస్​ ప్రవీణ్​​కుమార్​

మంచిప్ప ప్రాజెక్టు రీడిజైన్​ ఎవరి కోసం? : ఆర్​ఎస్​ ప్రవీణ్​​కుమార్​

నిజామాబాద్​, వెలుగు : నిజామాబాద్​లోని మంచిప్ప రిజర్వాయర్​ రీ డిజైన్​తో రైతులకు కొంచెం కూడా ఉపయోగంలేదని బీఎస్పీ స్టేట్​చీఫ్​ డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ ​అన్నారు. నష్టపోయే భూనిర్వాసితులు ప్రశ్నిస్తే హత్యాయత్నం  కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. నిర్వాసితులు భయపడాల్సిన అవసరంలేదని, వారికి తాము అండగా ఉంటామన్నారు. ఆదివారం ఆయన రైతులతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ​ప్రవీణ్​కుమార్​ మాట్లాడుతూ కేవలం కమీషన్లు, కాంట్రాక్టర్​ లాభాల కోసమే రీడిజైన్ ​నిర్ణయం తీసుకున్నారని, ప్రజాధనాన్ని దోచుకునే పాలకుల కుట్రను ఆపాల్సిన అవసరం ఉందన్నారు.  రిజర్వాయర్​ డిజైన్​  మార్చడం వల్ల ఎనిమిది గిరిజన తండాలు, రెండు గ్రామ పంచాయతీలు ముంపునకు  గురవుతాయన్నారు. నాలుగు వేల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. తరతరాలుగా వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులు, చిన్నకారు రైతులు నిర్వాసితులుగా మారతారన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఉన్న 300 ఎకరాల ఫామ్​హౌస్​ను ప్రాజెక్టుల పేరుతో లాక్కుంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.  రైతులపై నమోదు చేసిన హత్యా యత్నం కేసులు ఎత్తివేయాలన్నారు. కాళేశ్వరం 21, 22 ప్యాకేజీ పనులు తొమ్మిదేండ్ల నుంచి ముందుకు సాగడం లేదని విమర్శించారు. 

వీడీసీ ముసుగులో అరాచకాలు ఆపాలి

మోర్తాడ్ : వీడీసీల ముసుగులో సామాన్యులపై అరాచకాలు ఆపాలని బీఎస్పీ స్టేట్​ చీఫ్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిజామాబాద్ ​జిల్లా వేల్పూర్ మండలం మోతే గ్రామంలో కొన్ని నెలలుగా దళితుడైన రవి కుటుంబానికి, వీడీసీకి మధ్య భూతాగాదా నెలకొంది. ఈ క్రమంలో ఆయన భూమిని లాక్కునే ప్రయత్నాలు జరుగుతుండగా విషయం తెలుసుకున్న ప్రవీణ్​కుమార్​..గ్రామానికి వచ్చి రవి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రవీణ్​కుమార్​ మాట్లాడుతూ వీడీసీ వ్యవస్థ పల్లెల్లో అరాచకం సృష్టిస్తోందని, దాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.  రవి కుటుంబానికి రక్షణ కల్పించే బాధ్యత పోలీసులదేనన్నారు. దళితులకు అన్యాయం జరిగితే ఆందోళన చేస్తామన్నారు.