- వెస్ట్ బెంగాల్లో దారుణం
- మృతుల్లో ప్రెగ్నెంట్ మహిళ, ఆరేళ్ల బాబు
- రాజకీయ రంగు పులుముకున్న ఘటన
కోల్కతా: ఆర్ఎస్ఎస్ కార్యకర్తతోపాటు అతడి ప్రెగ్నెంట్ భార్య, ఆరేళ్ల కొడుకును గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కోల్కతాకు 200 కిలోమీటర్ల దూరంలోని జియాగంజ్లో బంధుప్రకాశ్ పాల్ (35), అతడి భార్య బ్యూటీ (30), కొడుకు ఆర్య(6) నివాసం ఉంటున్నారు. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసే బంధుప్రకాశ్ పాల్ ఈ మధ్యే ఆర్ఎస్ఎస్లో చేరి యాక్టివ్గా పనిచేస్తున్నాడు. దీంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. దసరా రోజే వీళ్లను హత్యచేసి ఉండొచ్చని భావిస్తున్నారు. పండుగ రోజు ఆ ఏరియాలోని పూజా మండపం దగ్గరకు బంధు ప్రకాశ్ పాల్ కుటుంబ సభ్యులెవరూ రాకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది.
ఇంటికొచ్చి తలుపు తట్టడంతో రక్తపు మడుగులో డెడ్బాడీస్ కన్పించాయి. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారమిచ్చారు. రెండేళ్ల క్రితమే కొడుకు చదువు కోసం వీరు జియాగంజ్కు షిఫ్ట్ అయ్యారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైనట్టు కేసు నమోదు చేశామని, ఈ హత్యలకు రాజకీయ, మతపరమైన కారణాలు ఉండకపోవచ్చని పోలీసులు వెల్లడించారు.
కుటుంబ ఆస్తి, వ్యక్తిగత సంబంధాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే ఈ మర్డర్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ ఘటనపై స్టేట్ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పత్రా ట్విట్టర్లో స్పందించారు. బెంగాల్లో శాంతి భద్రతలు క్షీణించాయని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు రక్షణ లేకుండాపోయిందని ఆరోపించారు. ఇంత దారుణానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.