
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రధాని కార్యాలయం బీజేపీ నేతలకు, మంత్రులకు కీలక ఆదేశాలు చేసింది. ప్రధాని మోదీతో సమావేశం అవ్వాలంటే అంత కంటే ముందు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలని స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం.. బుధవారం సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు ఏడుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని మోదీని కలిసి డిన్నర్ చేయాల్సి ఉంది. అయితే.. వీరందరూ ప్రధాని మోదీని కలిసే ముందు కోవిడ్ పరీక్షలు చేయించునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
ఢిల్లీకి చెందిన 70 మంది బీజేపీ నేతలు బుధవారం ప్రధాని నివాసంలో ఆయనను కలవాల్సి ఉంది. వీరంతా ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయించుకునేందుకు వెళుతున్నారని సమాచారం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించాక ప్రధాని మోదీ తొలిసారి ఢిల్లీ సీఎంతో పాటు ఢిల్లీ బీజేపీకి చెందిన 70 మంది నేతలను బుధవారం రాత్రి 7:30కు డిన్నర్కు ఆహ్వానించారు. అయితే.. ఇంత మంది వెళ్లే ఈవెంట్ కావడంతో ముందు జాగ్రత్తగా ఆర్ టీ పీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని ప్రధాని కార్యాలయం సూచించినట్లు తెలిసింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం.. దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 306 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనాతో చనిపోయారు. కరోనాతో ముగ్గురు కేరళలో, ఒకరు మహారాష్ట్రలో, ఇద్దరు కర్ణాటకలో ప్రాణాలు కోల్పోయారు. ఒక్క కేరళలోనే కొత్తగా 170 కరోనా కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 114 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 66 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఢిల్లీలో 757కు చేరాయి.