శివారుల్లో ఆర్టీసీ.. సిటీలో ప్రైవేట్ ట్రావెల్స్

శివారుల్లో ఆర్టీసీ.. సిటీలో ప్రైవేట్ ట్రావెల్స్

ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నట్రావెల్స్ బస్సులు
రోడ్డుకు అడ్డంగా నిలుపుతూ ఇబ్బందులు
పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ నిలుపుతూ ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రోజురోజుకు వీరి ఆగడాలు ఎక్కువవుతున్నాయి. లింగంపల్లి, కూకట్ పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట, లక్డీకాపూల్, కాచిగూడ, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో అడ్డగోలుగా నడి రోడ్డుపైనే బస్సులను నిలుతున్నారు. సంక్రాంతి పండుగ సమయం కావటంతో ఇది మరింత సమస్యలు సృష్టిస్తుంది. ఒక బస్సు వెనుక మరో బస్సు నిలుపుతూ ఇతర వాహనదారులను పరేషాన్‌కు గురి చేస్తున్నారు. ప్రయాణికులను ఎక్కించుకోవడం కోసం రద్దీ ప్రాంతాల్లోనూ రోడ్లపైనే బస్సులను నిలుపుతూ వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రోడ్డు చిన్నగా ఉన్న లక్డీకాపూల్ లోని టెలిఫోన్ భవన్ వద్ద ట్రావెల్స్బస్సులు నిలపుతుం డడంతో రాత్రి పన్నెండు గంటలకు కూడా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. సంక్రాంతి సీజన్కావడంతో సమస్య మరీ ఎక్కువగా ఉంది.

సిటీలో ట్రాఫిక్ నివారణకు..
సంక్రాంతి సందర్భంగా సిటీలో రద్దీని నివారించేందు కు ఆర్టీసీ బస్సులను శివారు ప్రాంతాల నుంచి నడిపిస్తున్నారు. ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, ఎల్ బీ నగర్, హయత్ నగర్, జేబీఎస్ నుంచి బస్సులు ప్రారంభమవుతున్నాయి. ప్రయాణికులు సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాఫ్ ల వద్దనే బస్సులు ఎక్కుతున్నారు. దీని కోసం ప్రయాణికులకు మళ్లీ చార్జీల భారం పడుతోం ది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం ఇష్టానుసారంగా నడుపుతూ ప్రయాణికులు ఎక్కడుం టే అక్కడే ఎక్కించుకుంటున్నాయి. లింగంపల్లి నుంచి హయత్ నగర్ వరకు దాదాపు 10 చోట్ల బస్సులు ఆపుతూ ప్రజలను ఇబ్బందు లకు గురి చేస్తున్నాయి.

ట్రాఫిక్ పోలీసులు, రవాణా అధికారుల మౌనం
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు మౌనం వహిస్తున్నారు. ట్రావెల్స్ బస్సులను చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా రెండు రోజులుగా ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టిం చుకోవటం లేదు. ఇక రవాణా శాఖ అధికారుల తీరుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సిటీ శివారులో అక్కడకక్కడ తనిఖీలు నిర్వహి స్తున్న అధికారులు.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల జోలికి వెళ్లడం లేదు. దీంతో ట్రావెల్స్ డ్రైవర్లు ఇష్టానుసారంగా నడుపుతూ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు.

ప్రతిపాదన కాగితాలకే పరిమితం
వాస్తవానికి నగరంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుల కారణంగా విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండటంతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారించాలని రవాణా శాఖ, ట్రాఫిక్ ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్స్ ను సిటీ శివారు ప్రాంతాల నుంచి నడిపేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సిటీలోని ప్రయాణికులను శివారు ప్రాంతాల వరకు మినీ బస్సుల ద్వారా తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ నిబంధనను ప్రైవేట్ ట్రావెల్స్ తుంగలో తొక్కాయి. మినీ బస్సులను ఉపయోగించడం లేదు. కూకట్ పల్లి నుంచి హయత్ నగర్ వరకు పలు చోట్ల రోడ్లపైనే ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఇతర వాహనదారులను పరేషాన్ చేస్తున్నారు.