బస్సు నడుపుతుండగా ఛాతి నొప్పి.. పక్కకు ఆపి ప్రాణాలొదిలిన ఆర్టీసీ డ్రైవర్​

బస్సు నడుపుతుండగా ఛాతి నొప్పి.. పక్కకు ఆపి ప్రాణాలొదిలిన ఆర్టీసీ డ్రైవర్​
  •     30 మందిని కాపాడిన శ్రీనివాస రావు
  •     ఖమ్మం జిల్లా కల్లూరు సమీపంలో ఘటన

 
కల్లూరు, వెలుగు : సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్ గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటన బుధవారం ఖమ్మం జిల్లా కల్లూరులో జరిగింది. జిల్లాలోని వేంసూరు మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన కాకాని శ్రీనివాసరావు (46) సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. డ్యూటీలో భాగంగా సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ నుంచి 30 మంది ప్రయాణికులను ఎక్కించుకొని ఖమ్మం బయలుదేరాడు.

 కల్లూరు పాత బస్టాండ్ సమీపంలోకి రాగానే శ్రీనివాసరావు ఛాతిలో నొప్పి వచ్చింది. అయినా నొప్పిని భరిస్తూ బస్సును ఎలాగో రోడ్డు పక్కన ఆపాడు.  పరిస్థితి గమనించిన ప్రయాణికులు శ్రీనివాసరావును సమీపంలోని గవర్నమెంట్ దవాఖానకు తీసుకువెళ్లారు. డాక్టర్లు ట్రీట్​మెంట్​చేస్తుండగానే ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.