రాజ్భవన్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

రాజ్భవన్  దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీన బిల్లు ప్రస్తుతం గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ లో ఉంది. అయితే బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ  రాజ్ భవన్ ముట్టడికి పిలుపు నిచ్చారు ఆర్టీసీ కార్మికులు. ఈ క్రమంలోనే నెక్లెస్ రోడ్డు నుంచి, అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా రాజ్ భవన్ కు బయల్దేరారు .

మరో వైపు  రాజ్ భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. రాజ్ భవన్ లోపలకు ఆర్టీసీ కార్మికులు రాకుండా రెండంచెల భద్రతతో బారికేడ్లను ఏర్పాటు చేశారు.  ఆర్టీసీ కార్మికులు రాకుండా ఖైరతాబాద్ కూడలి నుంచి రాజ్ భవన్ వెళ్ళే రూట్ ను బంద్ చేశారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఇవాళ ఉదయం రెండు గంటల పాటు బంద్ కు పిలుపు నిచ్చారు ఆర్టీసీ కార్మికులు. బిల్లును ఆమోదించి ఆర్టీసి కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రెడు గంటల పాటు ఆర్టీసి స్తంభించింది. 

ప్రభుత్వ ఆరోపణలపై రాజ్ భవన్ క్లారిటీ ఇచ్చింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లుపై కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ వాటిని క్లారిఫై చేయాలని గవర్నర్ తమిళిసై సీఎస్ శాంతికుమారికి లేఖ రాశారు. బిల్లును నిన్నే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. గవర్నర్ అనుమతి రాకపోవడంతో అది కాస్త ఆగింది. గవర్నర్ కావాలనే బిల్లును ఆపుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. దీంతో రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది. 

ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును గవర్నర్ నిశితంగా పరిశీలించారని.... కొన్ని అంశాలపై క్లారిటీ కోసం.... వివరణ ఇవ్వాలని సీఎస్ లేఖ రాశామని చెప్పింది రాజ్ భవన్. ఆర్టీసీ కార్మికులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం వివరణ అవసరమని భావిస్తున్నామంది.  ప్రభుత్వం నుంచి వెంటనే సమాధానం వస్తే బిల్లును గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని ప్రకటనలో తెలిపింది రాజ్ భవన్.