
జహీరాబాద్, వెలుగు : ఇన్నాళ్లూ నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీ లాభాల బాట పట్టిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో గురువారం మీడియాతో మాట్లడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలంలోనే ఎలాంటి నియామకాలు, అమ్మకాలు లేకుండానే ఆర్టీసీకి లాభాల్లోకి తీసుకొచ్చామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగకరంగా మారిందన్నారు.
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మహిళా సంఘాలకు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సులు సమకూరుస్తున్నట్లు చెప్పారు. మహిళా సంఘాలకు ఇప్పటికే 150 బస్సులు ఇచ్చామని, త్వరలోనే మరో 400 బస్సులు ఇస్తామన్నారు. హైదరాబాద్లో కాలుష్య నివారణ కోసం త్వరలోనే 2,800 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులు ఓఆర్ఆర్ అవతల తిరిగేలా చర్యలు చేపట్టామన్నారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు టీచర్ల నియామకాలు చేపట్టామని, గురుకులాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.
పర్యావరణాన్ని కాపాడడం ప్రతిఒక్కరి బాధ్యత అని, కాలుష్య నివారణ కోసం ప్రతిఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే మాణిక్రావు, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్రెడ్డి, నాయకులు ఉజ్వల్ రెడ్డి, హనుమంతరావు పటేల్, భాస్కర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రామలింగారెడ్డి, శుక్లవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.