- పట్టించుకోని ఆర్టీవో అధికారులు
- సిటీలో10 వేలకు పైగా స్కూల్ బస్సులు, వ్యాన్లు
హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 1 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అవుతుండగా.. బస్సుల ఫిట్నెస్పై ఆర్టీవో ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఏడాదిన్నర తర్వాత స్కూల్ బస్సులు రోడ్డెక్కనుండగా, ఇప్పటికీ సగానికి పైగా షెడ్డులకే పరిమితమయ్యాయి. కరోనా ఎఫెక్ట్తో గతేడాది ఆర్టీవో ఫిట్నెస్ ప్రక్రియ నిలిచిపోయింది. బస్సుల ఫిట్నెస్ను చెక్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం సంబంధిత స్కూల్ మేనేజ్ మెంట్లు అలసత్వానికి కారణమవుతోంది. ఏడాదిన్నర తర్వాత తెరుచుకోనున్న సూళ్లతో... బస్సుల ఫిట్ నెస్ కీలకంగా మారింది. బస్సుల ఫిట్ నెస్, డ్రైవర్ల లైసెన్స్ రెన్యూవల్ వంటి వాటిపై ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవడానికి ఆర్టీవో నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. గతేడాది మే నెల నాటికే స్కూల్ బస్సుల ఫిట్నెస్ ముగిసింది. గ్రేటర్ లోని అన్ని స్కూళ్లు, కాలేజీల బస్సులు, వ్యాన్లకు ఫిట్ నెస్ పరీక్షలు తప్పనిసరి. షోరూం నుంచి వచ్చిన కొత్త స్కూల్ బస్సులకు రెండేండ్ల తర్వాత ఫిట్నెస్ చేయించాల్సి ఉంటుంది. స్కూల్ మేనేజ్ మెంట్లు బస్సును స్క్రాప్ వేయాలన్నా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల్లో పిల్లలను ఎలా పంపాలంటూ ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కొన్ని స్కూల్ మేనేజ్ మెంట్లు ఫిట్నెస్ టైమ్ లో చూపిన డ్రైవర్లను ఆ తర్వాత తీసేస్తాయి. మొదట ఎక్స్ పీరియన్స్ ఉన్న డ్రైవర్ల వివరాలను పొందుపర్చి..తర్వాత లేని వారితో బస్సులను నడిపిస్తుంటాయి. ఏడాదిన్నర నుంచి షెడ్డులకే బస్సులు పరిమితమైన నేపథ్యంలో... రవాణా శాఖ ఆధ్వర్యంలో స్కూల్ మేనేజ్ మెంట్లకు, బస్సు డ్రైవర్లకు అవేర్ నెస్ ప్రోగ్రామ్
నిర్వహించాల్సిన అవసరం ఉంది. సిటీలో 8 వేలకు పైగా స్కూల్ బస్సులు ఉండగా, ఆటోలు, వ్యాన్లు, ఇతర వెహికల్స్ మరో 2 వేల వరకు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా ఫిట్ నెస్ లేనివే అని తెలుస్తోంది. ఆర్టీవో కళ్లు గప్పిఈ వెహికల్స్ బడి పిల్లలతో రోడ్డెక్కితే సమస్యగా మారనుంది. స్కూల్ బస్సుల నిర్వాహకులు రూల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేరెంట్స్ సూచిస్తున్నారు. ప్రతి నెల మే నెలలో స్కూల్ బండ్ల వెహికల్స్ కు ఫిట్ నెస్ చేయాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని, హైకోర్టు రూపొందించిన గైడ్ లైసెన్స్ అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆర్టీవో ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు.