
= విలీనం కోసం బీజేపీ ఒత్తిడి తెచ్చిందన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
= కవిత అరెస్టు కావద్దంటే విలీనం చేయుమన్నారని వ్యాఖ్య
= ప్రాణమైనా ఇస్తాం కానీ మెర్జర్ ఉండదని కేసీఆర్ చెప్పారని క్లారిటీ
= కవితను అరెస్టు చేయొద్దు.. విలీనం చేస్తామన్నది వాళ్లేనన్న బండి సంజయ్
= అవినీతితో బీజేపీ కలువదంటున్న కేంద్ర మంత్రి
= వీళ్లిద్దరి వ్యాఖ్యల్లో ఏది నిజం.. ఆసక్తికరంగా విలీనం కథ
హైదరాబాద్: బీజేపీ–బీఆర్ఎస్ విలీనం అంశం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇరు పార్టీల నాయకుల స్టేట్ మెంట్లు భిన్నంగా ఉంటుండంతో ఏం జరిగిందనే చర్చ నడుస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. లిక్కర్ కేసులో కవిత అరెస్టుకు ముందు బీజేపీ నేతలు బీఆర్ఎస్ ను విలీనం చేయాలని కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చారని చెప్పారు.
లిక్కర్ స్కాం కేసులో ఆమెను కావాలని ఇరికించారని అన్నారు. బీజేపీ ఒత్తిడికి కేసీఆర్ తలొగ్గలేదని, ప్రాణాలైనా ఇస్తాం కానీ బీజేపీలో విలీనం చేసే ప్రసక్తే లేదని కేసీఆర్ కుండబద్దలు కొట్టారని అన్నారు. విలీనం కుదరదని చెప్పడంతోనే ఆమెపై కేసు పెట్టారని, ఆమె ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపారని అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎట్టి పరిస్థితిలోనూ ఉండదని అన్నారు. బీఆర్ఎస్ కు ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయం కన్నా ఎక్కువ క్రేజీ వచ్చిందని చెప్పారు. ఒంటరిగానే అధికారంలోకి రాబోతోందని చెప్పారు.
కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరు కూడా తమ నాయకుడు కేసీఆర్ అనే చెబుతున్నారని, కాబోయే ముఖ్యమంత్రి ఆయనేనని పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఆయన కరీంనగర్ లో ఇవాళ (May 31) మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్టు జరగకుండా ఉండేందుకు మా పార్టీతో కలిసేందుకు ప్రయత్నించారన్నారు.
అవినీతి బీఆర్ఎస్ లో బీజేపీ ఎప్పటికీ కలవదని చెప్పారు. గతంలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని అన్నారు. ఇద్దరి మాటలు పరస్పర భిన్నంగా ఉండటంతో ఇంతకూ బీఆర్ఎస్ రిక్వెస్ట్ చేసిందా..? బీజేపీ ఒత్తిడి తెచ్చిందా..? రెండింటిలో ఏది నిజమన్నది ఆసక్తికరంగా మారింది.