భారత్​ జోడో యాత్రకు మహిళలను సమీకరణ సమావేశంలో గొడవ

భారత్​ జోడో యాత్రకు మహిళలను సమీకరణ సమావేశంలో గొడవ

మహబూబ్​నగర్, వెలుగు : కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్​ జోడో యాత్రకు’ మహిళలను సమీకరించేందుకు మహబూబ్​నగర్ ​జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో సోమవారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. మహిళా కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, ఉపాధ్యక్షురాలు మాధవి అనుచరుడికి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ కాస్త స్థానిక పోలీస్​స్టేషన్​లో కంప్లైంట్ ​చేసుకునేదాక వెళ్లింది.

వివరాల్లోకి వెళ్తే.. సమావేశానికి చీఫ్​ గెస్ట్​గా హాజరైన సునీతా రావు మాట్లాడుతూ.. త్వరలో రాహుల్​గాంధీ యాత్ర ఉమ్మడి పాలమూరుకు రానుందని, మహిళలను సమీకరించాలని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్​అధ్యక్షురాలు నీతా డిసౌజ ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. మండలాల వారీగా ఇచ్చిన లిస్ట్​ప్రకారం సమీకరణ చేయాలన్నారు. గతంలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర స్థాయి మీటింగులకు జిల్లా అధ్యక్షురాలు బెక్కరి అనిత రాలేదని, పని తీరు మార్చుకోవాలని సూచించారు. తన పనితీరు బాగులోకపోతే పదవికి రాజీనామా చేస్తానని బెక్కరి అనిత ఏడ్చుకుంటూ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై జోక్యం చేసుకున్న పాలమూరు డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ ​సునీతారావుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మహిళల సమావేశంలో మగవాళ్లు వివరణ ఇవ్వడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాధవి అనుచరుడు సునీతారావుకు ఎదురు మాట్లాడారు. ‘నువ్వు మాకు డిక్టేట్​చేయాల్సిన అవసరం లేదు. ఇది కాలేజీ కాదు. నువ్వు ప్రిన్సిపాల్​కాదు. మేం స్టూడెంట్లం కాదు’ అని అన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సునీతారావు సమావేశం ముగించి బయటికి వెళ్లారు. మహిళా లీడర్లతో కలిసి టూటౌన్ ​పోలీస్​స్టేషన్​లో కంప్లైంట్ చేశారు. అనంతరం తిరిగి పార్టీ ఆఫీసుకు రాగా, లీడర్లు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.