పాలకులకు.. అహల్యాబాయి ఆదర్శం కావాలి

పాలకులకు..  అహల్యాబాయి ఆదర్శం కావాలి

అహల్యాబాయి హోల్కర్ త్రిశత జయంత్యుత్సవాలు నేడు ముగింపు సందర్భంగా స్త్రీ   స్వేచ్ఛకు ప్రతిరూపం, స్త్రీ ఎవరికీ బానిస కాదని నిరూపించిన వనిత అహల్యాబాయి హోల్కర్. పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ ఇంత సాధికారతతో ఎలా కొనసాగిందో ఎవరికీ అంతుపట్టని విషయం. భారతీయ స్త్రీలు వంటింటి కుందేళ్లుగా, పచ్చళ్ళకు, పిడకలకు, అలుకులకు మాత్రమే పరిమితం కాదని.. 18వ శతాబ్దంలోనే ఒక వ్యక్తిగా, కుటుంబపరంగా, సమాజ వికాసంలో, రాజ్య పరిపాలనలో అందె వేసిన చెయ్యి అని రాణి అహల్యాబాయి నిరూపించింది. 

భారతీయ సమాజంలోనే ఒక విప్లవాత్మక భావసంచలనం సృష్టించిన అహల్యాబాయిని ఈ జాతి ఎందుకు మరిచిపోయింది? సమాజాన్ని పీల్చి పిప్పిచేస్తున్న దురాచారాల నిర్మూలనకు పురుషులు, కాదు స్త్రీలే నడుము కట్టారని అహల్యాబాయి గురించి చదివితే అర్థం అవుతుంది. నేడున్న పరిస్థితుల్లో ఆమె మనకు ఆదర్శ పాలకురాలు. రాణి అహల్యాబాయి స్త్రీ స్వేచ్ఛని, స్త్రీ, పురుషుల సమానత్వాన్ని, సమాజ వికాసాన్ని కాంక్షించింది. 

అసమానతల గోడలు కూల్చి, తన కూతురుకి కులాంతర వివాహం చేసి, సమత, మమతలు నిండిన సంతోషకర సమాజాన్ని నిర్మించిన గొప్ప సంస్కర్త అహల్యాబాయి. అంతటి గొప్ప మహిళామణిని, మబ్బులో దాగిన ఈ స్వాతి కిరణాన్ని వెలికితీసి నేటి సమాజానికి ఆదర్శంగా అహల్యాబాయిని నిలపటంలో మనం ఆలస్యం చేశాం.   ప్రాంతాలు, భాషలు వేరైనా కూడా భారతీయ జీవన సౌందర్యాన్ని గ్రహించి, అన్ని రాజ్యాల రాజులకు తెలియపరిచింది. అహల్యను అబలగా భావించి ఆట పట్టిద్దామనుకున్న ఒకరిద్దరు రాజులకు తన సమగ్ర పరిపాలనతో, యుద్ధ నైపుణ్యాలతో గట్టి జవాబు ఇచ్చింది. అలా అని పురుష ద్వేషిగా మారలేదు. 

వివాహం అయినప్పటి నుంచి తన మామ మలహర్ రావ్ అందించిన స్ఫూర్తి, ప్రేరణల కారణంగానే, విద్యలో,  లెక్కల్లో, ఆర్థిక నిర్వహణలో, రాజ్య పాలనలో,  యుద్ధతంత్రంలో  ఆ రోజుల్లోనే ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఆకాశంలో సగ భాగం ఆడది అని నిరూపించింది. భర్త చనిపోయి వితంతువు అయినా కూడా అహల్యాబాయికి బహిరంగంగా రాజ్యపాలనకు అధికారాలు కట్టబెట్టారు ఆయన.రాజులు, రాణులు అంటేనే  నియంతృత్వంతో  కూడిన స్వార్థపరులంటూ కథలు చెప్పే వారున్న ఆ రోజుల్లోనే మామ మలహర్రావు, కోడలు అహల్యాబాయి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆదర్శ పాలన చేశారు.

ఉపాధి మార్గాలు చూపింది

రైతుల నడ్డివిరిచి పన్నులు వసూలు చేసే తెల్లదొరలు ప్రవేశించిన కాలంలో, రైతులు పండించిన పంటలకు అన్ని రాజ్యాల్లో మార్కెట్ సౌకర్యం కల్పించిన ఆమె కరుణా భావన ఎంతో గొప్పది. చేనేత కార్మికుల కష్టాలను స్వయంగా చూసి, మంచి డిజైన్లతో కూడిన చీరలను తయారు చేయించి అన్ని రాజ్యాల్లో వాటికి బ్రాండ్ రూపొందించి,  ప్రత్యేకంగా  ‘మహేశ్వర్' నగరాన్ని చీరలకు ప్రసిద్ధిగా తీర్చిదిద్దిన నిపుణురాలు అహల్యాబాయి.  ఆ రోజుల్లో వితంతు మహిళల నిబిడీకృతమైన ప్రతిభను వెలికి తెచ్చేందుకు, స్త్రీలకు నైపుణ్య శిక్షణనిచ్చి వారికి ఉపాధి కల్పించటం విశేషం. 

పురుషాధిక్యతపై యుద్ధం ప్రకటించటం, పాశ్చాత్యుల సంస్కృతి. కానీ, పురుషులకు వాస్తవ స్థితిగతులు అర్థం చేయించి, వారి సహకారంతోనే పనులు చక్కపెట్టే నిపుణత కలిగి ఉండటం భారతీయ స్త్రీ లక్షణమని చాటి చెప్పిన స్త్రీమూర్తి రాణి అహల్యాబాయి.  ఉపాధి లేక దారి దోపిడీలకు పాల్పడుతున్న గిరిజనులలో (భిల్లులు) ఆత్మాభిమానం నింపి, వారిలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి, వారికి ‘నాయక్' అనే బిరుదునిచ్చి గౌరవించింది. అడవుల గుండా యాత్రలు, దైవ 
దర్శనానికి వెళ్లేవారిని పల్లకి ద్వారా తీసుకెళ్ళేలా సౌకర్యాలు కల్పించి, ఆ పనిని ఆ గిరిజనులకు అప్పగించి, వారికి అదాయాన్ని కల్పించిన గొప్ప ప్రజా సంక్షేమ పాలకురాలు అహల్యాబాయి.

పుణ్యశ్లోకి దేవి అహల్యాబాయి :  భాగవత్

అహల్యాబాయి హెూల్కర్ త్రిశతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రత్యేక ప్రసంగం చేస్తూ ఆమె చరిత్ర నేటికీ మనకి ఆదర్శవంతం అన్నారు. ఆమెను 'పుణ్యశ్లోకి' అని కీర్తించారు.  ఒంటరి మహిళ అయినప్పటికీ తన పెద్ద రాజ్యాన్ని  సురాజ్యంగా మలిచారు. పాలకుడు ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలనే విషయంలో ఆదర్శంగా నిలిచారు. తన పాలనలో ప్రజలకు అనేక బాధల నుంచి విముక్తి కల్పించింది, ఎన్నో దుఃఖాల నుంచి రక్షించింది, ఒక విధంగా ప్రజల పట్ల తన కర్తవ్యాలన్నింటిని ఆమె పూర్తిచేసింది. 

అహల్యాబాయి సాంస్కృతిక స్థలాల అభివృద్ధిని తన సొంత నిధులతో చేశారు. తన ఆస్తులను అందుకోసం వినియోగించారు.  ఆమె రాణి అయినప్పటికీ సామాన్య జీవనాన్ని గడిపారు.  ప్రజాపాలన, దేశంలో ఏకాత్మత, సమగ్రత, సామాజిక సామరస్యం, సౌశీల్య నిర్మాణం వంటి అన్ని రంగాలనూ అభివృద్ధి చేయడంలో ఆమె ఆదర్శంగా నిలిచారు.

 అందుకే ఆమె అందరికీ ఆదర్శ పాలకురాలు. ఈ ఏడాది మొత్తం ఆమె త్రిశతాబ్ది ఉత్సవాలను మనం జరుపుకోవటం సంతోషదాయకం. ఉత్సవాలను జరపటమే కాదు, ఆమె ఉత్తమ, ఆదర్శ లక్షణాలను కూడా మనం పుణికిపుచ్చుకోవాలి.

అన్ని రంగాల్లోనూ సురాజ్యం

దేవి అహల్యాబాయి తన రాజ్యం గురించి మాత్రమే కాక మొత్తం దేశం గురించి ఆలోచించారు. మన దేశ సంస్కృతిని మరింత మెరుగుపరచడానికి, విస్తరింపచేయడానికి దేశంలో ఎన్నో స్థలాల్లో ఆలయాలను నిర్మించారు. శ్రీ శంకరుడి ఆజ్ఞతో రాజ్యాన్ని పాలిస్తున్నానని భావించేవారు. భారతదేశం మొత్తం ఎన్నో స్థలాల్లో ఆలయాలు, నదులకు అనుసంధానంగా ఘాట్లు, ధర్మశాలల నిర్మాణం చేయించారు. 

మన దేశమంతటా ప్రజల రాకపోకలు జరగాలంటే దేశవ్యాప్తంగా సాంస్కృతిక స్థలాల నిర్మాణం, వాటి అభివృద్ధి జరగాలి. తద్వారా రాకపోకలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి.  ప్రజలకు జీవనోపాధీ లభిస్తుంది. పైగా ‘మనమంతా ఒక్కటే' అనే భావం పెంపొందుతుంది.  ఇన్ని ప్రయోజనాలు, ఇంతటి సంక్షేమం ఉంది కాబట్టే సాంస్కృతిక స్థలాల అభివృద్ధిపై దేవి  అహల్యాబాయి దృష్టిసారించి, అభివృద్ధి చేశారు.

-అప్పాల ప్రసాద్, కన్వీనర్, అఖిల భారత సమరసతా కళా విభాగం-