
కీవ్: ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఒడెసాపై బాంబులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో మొత్తం 15 మంది చనిపోగా.. 116 మంది గాయపడ్డారు. 30 అపార్ట్ మెంట్లు నేలమట్టమయ్యాయి. కీవ్లో ఓ నివాస భవనంపై మిసైళ్లు దూసుకుపోవడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 99 మంది గాయపడ్డారు. బిల్డింగ్లో ఉన్నవారు నిద్రిస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ అటాక్లో ఆ బిల్డింగ్తో పాటు చుట్టుపక్కల ఉన్న అపార్ట్ మెంట్లు కూడా ధ్వంసమయ్యాయి.
ఇటీవలి కాలంలో తమ దేశంపై రష్యా జరిపిన అతి భీకర దాడుల్లో ఇదొకటని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. దాడుల్లో చనిపోయిన వారిలో ఓ అమెరికన్ ఉన్నాడని చెప్పారు. ‘‘రష్యా మిసైళ్లు, డ్రోన్లు మా పౌరుల భవనాలపై నేరుగా దాడి చేశాయి. దాడి జరిగిన తీరు చూస్తుంటే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ను టార్గెట్ చేసుకున్నట్లు ఉంది. దాదాపు 9 గంటల పాటు అటాక్ కొనసాగింది” అని అధికారులు పేర్కొన్నారు.
అలాగే, ఒడెసా పోర్ట్ సిటీపైనా రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది గాయపడ్డారు. రష్యా దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ స్పందించారు. కీవ్ పై రష్యా చేసిన అత్యంత భయానక దాడుల్లో ఇదొకటని ఆయన తెలిపారు. ‘‘440 డ్రోన్లు, 32 మిసైళ్లను రష్యా ప్రయోగించింది. యుద్ధం కొనసాగాలని పుతిన్ కోరుకుంటున్నరు” అని జెలెన్ స్కీ పేర్కొన్నారు.
గాజాలో 45 మంది పాలస్తీనియన్లు మృతి
గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ జరిపిన ఫైరింగ్లో 45 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. మావవతా సాయం కేంద్రం వద్ద ఈ ఘటన జరిగిందని పాలస్తీనా హెల్త్ ఆఫీసర్లు తెలిపారు. నిత్యావసర సరుకులతో కూడిన ట్రక్కులు ఆ ప్రాంతంలో ప్రవేశించాల్సి ఉందని, ఆ సమయంలో పాలస్తీనియన్లు అక్కడ ఎదురుచూస్తున్నారని వారు పేర్కొన్నారు. అంతలోనే ఇజ్రాయెల్ బలగాలు తమ పౌరులపై కాల్పులు జరిపాయని, ఆ కాల్పుల్లో 45 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. మానవతా సాయం అందిస్తున్న కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ బలగాలు ఇటీవలి కాలంలో అదేపనిగా కాల్పులకు తెగబడుతున్నాయని చెప్పారు.
=====================================================================