
- రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల రైతుల అకౌంట్లలో డబ్బులు జమ: తుమ్మల నాగేశ్వర రావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సాగులో ఉన్న ప్రతి గుంట భూమికీ రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఇప్పటివరకూ 15 ఎకరాల వరకు భూమి ఉన్న 67.01 లక్షల రైతుల ఖాతాల్లో రూ.8,284.66 కోట్లు జమ చేశామని వెల్లడించారు. మిగిలిన భూములకు మంగళవారం నాటికి ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం కేవలం 9 రోజుల్లోనే వానాకాలం రైతు భరోసా నిధుల విడుదల పూర్తి చేయడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారని, ప్రజా ప్రభుత్వం రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్ల మధ్య కూడా రైతు సంక్షేమంలో రాజీలేకుండా ఈ పథకాన్ని అమలు చేసిన సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. గతంలో 2- నుంచి 4 నెలలు పట్టే ప్రక్రియను 9 రోజుల్లో పూర్తి చేస్తున్నామని, దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అంతకుముందు రైతు రుణమాఫీని ఆగస్టు 15లోగా పూర్తి చేయడం, సన్నాలకు రూ.500 బోనస్తో రూ.2వేల కోట్ల అదనపు లబ్ధి కల్పించడం, మార్క్ఫెడ్ ద్వారా ప్రతి పంటను సేకరించడం వంటి చర్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రాజ్యాన్ని నిర్మిస్తున్నదని చెప్పారు. రైతు సంక్షేమం కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా.. ప్రతిపక్షాలు దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.
విజయోత్సవ సభను సక్సెస్ చేయండి
రైతు భరోసా విజయాన్ని రైతు పండుగగా జరుపుకొనేందుకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద విజయోత్సవ సభ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని, రైతులనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతులు, ప్రజా ప్రతినిధులకు ఆయన పిలుపునిచ్చారు. కాగా, సభ ఏర్పాట్లను సీఎస్ రామకృష్ణారావు, అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్రావుతో కలిసి మంత్రి తుమ్మల పరిశీలించారు.