
- కేంద్ర గెజిట్ లో కులగణన ప్రస్తావన ఎందుకు లేదు?
- ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సచిన్ పైలట్ ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ మోడల్ లో దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సచిన్ పైలట్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగణనలో కులగణన చేపట్టడం బీజేపీ సర్కార్ కు ఇష్టం లేదని విమర్శించారు. కేంద్ర గెజిట్ లో కులగణన ప్రస్తావనే లేకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీస్ లో సచిన్ పైలట్ మాట్లాడారు. కులగణన చేపట్టాలని కోరిన నేతలను ప్రధాని మోదీ పార్లమెంట్ వేదికగా అర్బన్ నక్సల్స్ అంటూ ముద్ర వేశారని మండిపడ్డారు. కరోనా సాకుతో సాధారణ జనగణన చేపట్టకుండా ప్రజలను బీజేపీ మోసం చేసిందన్నారు. జనగణనకు రూ.8 వేల కోట్ల నుంచి 10 వేల కోట్లు ఖర్చు అవుతుందని, కానీ కేంద్రం కేవలం రూ.570 కోట్ల మాత్రమే కేటాయించిందన్నారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ లో స్పష్టంగా కులగణన అని పేర్కొన్నదని గుర్తు చేశారు. సామాజిక, విద్యా, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సంబంధిత వివరాలను సేకరించేందుకు ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు తెలంగాణ సర్కార్ ముందుగానే నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిందన్నారు. కేవలం అధికారులతోనే కాకుండా నిపుణుల నేతృత్వంలోని ఎన్ జీవోలు, విద్యావేత్తల మద్దతుతో కుల సర్వే జరిగిందన్నారు. కులతత్వాన్ని కులగణన తీవ్రం చేస్తుందన్న బీజేపీ నేతల వాదనను కొట్టిపారేశారు. ఇది విభజన కాదని, సమానత్వానికి ఒక సాధనమని చెప్పారు. కులగణన అంశం కేంద్రం, ప్రతిపక్షాల మధ్య రాజకీయ సమస్యగా మిగిలిపోకూడదని హితవు పలికారు.