- ఈ నెల 15న కామారెడ్డిలో ఆక్రోశ సభ
- బీసీ రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య
కామారెడ్డి టౌన్, వెలుగు: గత అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను అమలు చేయాల్సిందేనని, 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహించిన సన్నాహక కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ ఆక్రోశ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. బీసీల అభివృద్ధికి ఏడాదికి రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని, ప్రతి మండలంలో రెసిడెన్షియల్ స్కూల్, ప్రతి జిల్లాలో ఒక బీసీ కాలేజీ స్థాపిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా రిజర్వేషన్లు పెంచుకోవడానికి చట్టం చేయాలన్నారు.
సీఎం రేవంత్రెడ్డి నిజాయితీగా ప్రయత్నం చేయలేదని, బీఆర్ఎస్,బీజేపీలకు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదన్నారు. సమావేశంలో ఆల్ఇండియా బీసీ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధర్ యాదవ్, ప్రతినిధులు క్యాతం సిద్దరాములు, భూమన్న, విఠల్, బాలార్జున్ గౌడ్, సునీల్ గౌడ్, దేవరాజు గౌడ్, వెంకటి పాల్గొన్నారు.
