కించపరిచేలా మాట్లాడలేదు.. ‘కశ్మీర్ ఫైల్స్’ వ్యాఖ్యలపై సాయి పల్లవి స్పందన

కించపరిచేలా మాట్లాడలేదు..  ‘కశ్మీర్ ఫైల్స్’ వ్యాఖ్యలపై సాయి పల్లవి స్పందన

‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఇటీవల నటి సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలపై వివాదం రాచుకుంది. ఈనేపథ్యంలో ఆమె స్పందించారు. తన  మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఎవ్వరినీ కించపరిచే విధంగా తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు.  ‘‘నా దృష్టిలో హింస అనేది  ముమ్మాటికి తప్పే.  హింస అనేది మంచిది కాదని గతంలోనే చెప్పాను. ఒక డాక్టర్ గా ప్రాణం విలువ నాకు తెలుసు. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు’’ అని సాయిపల్లవి వ్యాఖ్యానించారు. 

ఆ కామెంట్స్ ఏమిటి ? 

కాగా,  ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో సాయిపల్లవి నక్సల్స్ గురించి మాట్లాడుతూ.. " నక్సల్స్ ది ఒక ఐడియాలజీ. మనకు శాంతి అనేది ఒక ఐడియాలజీ. నాకు వయిలెన్స్ అంటే నచ్చదు.వయిలెంట్ గా ఉండి మనం ఏమి సాధించలేమనేది నా అభిప్రాయం"  అంటూ చెప్పుకొచ్చారు. మాటల్లో మాటగా ‘‘కశ్మీర్ ఫైల్స్’’ సినిమా గురించి సంచలన కామెంట్స్ చేశారు. ‘‘మా ఫ్యామిలీ లో లెఫ్ట్ రైట్ అని ఉండదు.న్యూట్రల్ గా ఉండే ఫ్యామిలీలో పెరిగాను. ఎవరో ఎవరినో హర్ట్ చేస్తున్నారని మనం కూడా చేయకూడదు. బాధితుల గురించి ఆలోచించాలి. కొన్ని రోజుల క్రితం 'ది కశ్మీర్ ఫైల్స్' అనే సినిమా వచ్చింది .. ఆ టైమ్ లో ఉన్న కశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు .. మనం మత ఘర్షణలా వాటిని చూస్తే.. రీసెంట్ గా ఓ బండిలో ఆవులని తీసుకెళ్లున్నారని ఆ వెహికిల్ ని నడుపుతున్న వ్యక్తి ముస్లిం అని కొంత మంది కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడుంది.’’ అంటూ సాయిపల్లవి వ్యాఖ్యానించారు.