హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రచేస్తున్నాయని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డా, కేసీఆర్, కేటీఆర్ అంతా కలిసి కాంగ్రెస్ను అడ్డుకోవాలని చూస్తున్నారని బుధవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్లో ఈటల రాజేందర్ చేరకుండా చూడడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారన్నారు. భవిష్యత్తులో తాను సీఎం కావాలనే ఈటలను కేటీఆర్ అడ్డుకున్నారని చెప్పారు.
ఈటలకు సెక్యూరిటీ పెంచడం, దానిపై కేటీఆరే స్వయంగా రివ్యూ చేయడం అందులో భాగమేనన్నారు. ఇక ఢిల్లీలో అమిత్ షాను కేటీఆర్ కలవలేకపోయారంటున్నారని, కానీ, జూమ్ మీటింగ్లో వాళ్లిద్దరూ చర్చలు జరిపినట్లు తమకు తెలిసిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ భూస్థాపితమైందని, బీఆర్ఎస్ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.