న్యూజిలాండ్ : భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కు న్యూజిలాండ్ ఓపెన్ లో షాక్ తగిలింది. బుధవారం జరిగిన ఫస్ట్ రౌండ్ లో వరల్డ్ నంబరు 212వ ర్యాంక్ క్రీడాకారణి వాంగ్ జియి చేతిలో ఓడింది సైనా. 67 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో 16-21, 23-21, 4-21తో సైనా ఓడిపోయింది.
ఫస్ట్ గేమ్ లోనే 19ఏళ్ల వాంగ్ జియి సైనాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడి 21-16తో ఫస్ట్ గేమ్ ను కైవసం చేసుకుంది. రెండో గేమ్ లోనూ జియి అదే దూకుడు ప్రదర్శించినప్పటికీ.. సైనా తిరిగి పుంజుకుంది. ఒక దశలో 19-19 పాయింట్లతో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఆ తర్వాత సైనా నాలుగు పాయింట్లు సాధించి రెండో గేమ్ లో విజయం సాధించింది.
అయితే గెలుపును నిర్ణయించే మూడో గేమ్ లో సైనా మళ్లీ తేలిపోయింది. జియి జోరును అడ్డుకోలేకపోయింది. ఈ గేమ్ లో సైనా 4 పాయింట్లే సాధించింది. దీంతో 2-1తో జియు విజయం సాధించింది. ఫలితంగా న్యూజిలాండ్ ఓపెన్ నుంచి సైనా తొలి రౌండ్ లోనే నిష్క్రమించింది.

