సలార్లో వరదరాజు సోదరి పాత్రలో శ్రియా రెడ్డి అదరగొట్టేసింది. సినిమాలో ఆమె లుక్కి..నటనకి మంచి మార్కులే పడ్డాయి. కొందరైతే శ్రియా రెడ్డి పాత్రని 'బాహుబలి' సినిమాలో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్రతో పోల్చుతున్నారు. దీంతో శ్రియా రెడ్డి పేరు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. అయితే శ్రియా రెడ్డిని చాలా మంది కొత్త నటి అనుకుంటున్నారు. కానీ ఆమె చాలా ఏళ్ల క్రితమే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
2002 లోనే 'సమురాయ్' అనే సినిమాతో తమిళ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'అప్పుడప్పుడు' అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఆరంగ్రేటం చేసింది. 'అమ్మ చెప్పింది' సినిమాలోనూ ఈ బ్యూటీ నటించింది. మలయాళంలోనూ సినిమాలు చేసింది. ఇవేవి శ్రియా రెడ్డికి అంత గుర్తింపు తీసుకురాలేదు.
విశాల్ తో నటించిన 'పొగరు' సినిమాతో మాత్రం నటిగా బాగా ఫేమస్ అయింది. అందులో పొగరబోతు లేడీ విలన్ పాత్రలో శ్రియా రెడ్డి నటన నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఆ సినిమాతోనే సౌత్ లో బాగా ఫేమస్ అయింది బ్యూటీ. ఇక సలార్ సినిమాతో ఈమెకి అవకాశాలు క్యూకట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే, పవన్ OG సినిమాలో..ఒక కీలకమైన పాత్ర కోసం శ్రియా రెడ్డిని తీసుకున్నారు. ఆమెకు వెల్కమ్ చెబుతూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.ఈమె హీరో విశాల్ బ్రదర్ విక్రమ్ కృష్ణ భార్య.