జయరాజా జూనియర్ గ్రాండ్ప్రి బ్యాడ్మింటన్ టోర్నీ
జయరాజా జూనియర్ గ్రాండ్ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ ప్లేయర్లు సామియా ఇమద్ ఫరూఖీ, పుల్లెల గాయత్రి మెయిన్ డ్రాకు అర్హత సాధించారు. ఇండోనేసియాలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ రెండు క్వాలిఫయింగ్ రౌండ్ల్లో సామియా సత్తాచాటింది. తొలి క్వాలిఫయింగ్ రౌండ్లో మూడోసీడ్ సామియా 21–19, 21–16తో కొమాంగ్ ఆయు కాహ్యా డెవి (ఇండోనేసియా)పై అలవోక విజయం సాధించింది. అనంతరం జరిగిన రెండో రౌండ్లో సామియా 18–21, 21–15, 21–18తో జపనీస్ ప్లేయర్ ఏ ఇయోన్ యూపై చెమటోడ్చి విజయం సాధించింది.
బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సామియా.. సహచర ప్లేయర్ ట్రీసా జాలీతో తలపడనుంది. మరో తొలి రౌండ్ మ్యాచ్లో ఇండియా బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రి.. థాయ్లాండ్కు చెందిన క్రిత్తాపోర్న్ జియాంతానెత్తో, జక్కా వైష్ణవీ రెడ్డి.. స్థానిక ప్లేయర్ మహారాణి శేఖర్ బతారితో తలపడనున్నారు. మన దేశానికే చెందిన మాళవిక బన్సోద్, ఆషి రావత్ కూడా బరిలో ఉన్నారు.
పురుషుల సింగిల్స్లో మనదేశ ప్లేయర్లు 4వ సీడ్ వరుణ్ కపూర్, 9వ సీడ్ ప్రియాంశు రజ్వత్, 13వ సీడ్ మీరబా లువాంగ్, బిద్యాసాగర్ సలామ్, అభిన్ వశిష్ట్, అమిత్ రాథోడ్, రోహన్ తూల్, ఇమ్రాన్ సోనోవాల్, కరణ్ నేగి ఆడనున్నారు. పురుషుల డబుల్స్లో తెలుగు ప్లేయర్ కోలగట్ల లోకేశ్రెడ్డి–అంకిత్ మండల్, మహిళల డబుల్స్ అండర్–15 విభాగంలో నరహరిషెట్టి శ్రీనిత్య–అనుపమ ఉపాధ్యాయ జోడీలు బరిలోకి దిగనున్నాయి. మిక్స్డ్ డబుల్స్ అండర్–19 కేటగిరీలో తెలుగు ప్లేయర్ బొక్కా నవనీత్–కవిప్రియ సెల్వం, మానవ్ రాజ్ సుమిత్–ట్రీసా జాలీ, శంకర్ ముత్తుస్వామి–లక్ష్మీ ప్రియాంక జంటలు ఆడనున్నాయి.

